పరిషత్ పోరులో టీడీపీ అభ్యర్ధులు-పోటీ న్యాయమేనన్న ఎంపీ రామ్మోహన్
ఏపీలో గతేడాది నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తిరిగి పాత నోటిఫికేషన్ ప్రకారమే నిర్వహించాలన్న ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్ణయాన్ని నిరసిస్తూ టీడీపీ ఎన్నికలను బహిష్కరించింది. అయితే ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్ధుల కొనసాగింపు విషయంలో టీడీపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీరంతా పార్టీ గుర్తులపై పోటీలో ఉన్న నేపథ్యంలో టీడీపీ ఈ ఎన్నికలను ఎలా బహిష్కరించినట్లు అవుతుందనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నా ఇంకా పలువురు అభ్యర్ధులు బరిలో ఉండటంపై శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చెప్పినా పలువురు ఇంకా పోటీలో ఉండటానికి స్ధానిక పరిస్ధితులే కారణమని చెప్పిన ఆయన.. అందులోనూ న్యాయం ఉందని వ్యాఖ్యానించారు. తద్వారా టీడీపీ అభ్యర్ధులు పరిషత్ పోరులో కొనసాగుతారని ఆయన చెప్పినట్లయింది.
మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలన్న టీడీపీ నిర్ణయాన్ని రామ్మోహన్ నాయుడు సమర్ధించుకున్నారు. ఓటమి భయంతో టీడీపీ ఎన్నికలను బహిష్కరించిందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు చెప్పటానికే ఎన్నికలను బహిష్కరించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ రాజ్యాంగానికి తూట్లు పొడిచిందని, రాజ్యాంగ బద్ధంగా జరగని ఎన్నికలు దేనికి అని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.