ఇంత దౌర్జన్యమా?: నడిరోడ్డుపై బైఠాయించిన టీడీపీ ఎంపీ కూతురు, కంటతడి
చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కుమార్తె డాక్టర్ మాధవీలత, ఆమె కారుడ్రైవర్పై ఓవ్యక్తి దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో ఉద్రిక్తతకు దారితీసింది.
తిరుపతి: చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కుమార్తె డాక్టర్ మాధవీలత, ఆమె కారుడ్రైవర్పై ఓవ్యక్తి దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ మాధవీలత తన కారులో రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో వస్తుండగా, ముందు వాహనం ఆగి ఉండటంతో హారన్ కొట్టారు. దీంతో ఆవేశంగా వచ్చిన నరేంద్రరెడ్డి అలియాస్ దీపు.. ఎంపీ డ్రైవర్ను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు.
తాను ఎంపీ కుమార్తెనంటూ మాధవీలత అడ్డుకోబోగా వినకుండా కులంపేరుతో దూషించినట్లు తెలిసింది. కాగా, కారు నెంబరు ప్రకారం చంద్రగిరి వద్ద దీపును చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకుని తిరుపతి ఈస్ట్ పోలీస్స్టేషన్కు తరలించారు.

కాగా, తన దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే వరకు ఇక్కడ్నుంచి కదిలేదిలేదని మాధవీలత రోడ్డుపైనే బైఠాయించారు. ఇంతలో ఎంపీ కుటుంబ సభ్యులూ సంఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మాధవీలత మీడియాతో మాట్లాడుతూ.. అడ్డుగా ఉన్న వాహనాన్ని చూసి హారన్ కొట్టినందుకు దీపు అనే వ్యక్తి తన కారు డ్రైవర్ ఆంజనేయులుపై దాడికి దిగారన్నారు.
అడ్డొచ్చిన తనపైనా దురుసుగా వ్యవహరిస్తూ కులం పేరిట దూషించినట్లు చెప్పారు. అతడి మేనమామ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కావడంతో క్షమాపణ చెప్పించకుండా చేస్తున్నారన్నారు. తమపై దాడిచేసేటప్పటికే అతడు మద్యం మత్తులో ఉన్నారన్నారు. అధికార పార్టీ ఎంపీ కుమార్తెకే ఇలా జరిగితే ఇక సామాన్యులకు రక్షణ ఎలా ఉంటుందని ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.
కాగా, దాదాపు 5 గంటలు పాటు రోడ్డుపైనే భైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎంపీ కుటుంబసభ్యుల ఆందోళనకు మద్దతుగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీడీపీ నేత డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పోలీసులు రంగప్రవేశం చేసి వారికి నచ్చచెప్పి ఆమెను ఇంటికి పంపించారు. కాగా, ఎంపీ శివప్రసాద్ ఈ ఘటనపై స్పందిస్తూ.. పోలీసుల తీరు బాగోలేదని అన్నారు. రాష్ట్రంలో ఏ మహిళకు కూడా ఇలాంటి అవమానాలు ఎదురుకావొద్దని, నిందితుడితో క్షమాపణలు చెప్పించకపోవడం విచారకరమన్నారు.












Click it and Unblock the Notifications