సోషల్ మీడియాలో నకిలీపోస్టులు పెడితే సన్మానాలు చేస్తారా..? టీడీపీ లక్ష్యంగా ఎంపీ సాయిరెడ్డి ఫైర్
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సిఐడి పోలీసులు నోటీసులు ఇవ్వడంపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకు ఘాటుగా జవాబిచ్చారు. ప్రభుత్వ చిహ్నంతో సోషల్ మీడియాలో నకిలీ పోస్టులు పెడితే సన్మానాలు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.
గ్రీష్మ, శిరీష, అనిత, పట్టాభి, అయ్యన్న మరి ఎవరైన .... అందరికీ ఒకటే చట్టం అని ఆయన పేర్కొన్నారు. చట్టానికి కుటుంబ నేపథ్యం, లింగ భేదం ఉండదు అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పిచ్చి వాగుడుకు చట్టపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదు అని విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మ ఒడి, వాహనమిత్ర పథకాలను రద్దు అవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసార శాఖా పేరుతో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన ఏపీ సీఐడీ పోలీసులు, పోలీసులు ఈ ఫేక్ న్యూస్ ను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలకు శ్రీకారం చుట్టారు.

అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు పలువురికి ఈ వ్యవహారంపై నోటీసులు అందించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నట్లు పెట్టిన పోస్ట్ పై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య అనుచరుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సిఐడి కార్యాలయంలో అతనిని విచారించారు. ఆ తర్వాత గౌతు శిరీష కు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురికి, విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో వారు సైతం విచారణ ఎదుర్కొన్నారు.
దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశ్నించే గొంతులను నొక్కెయ్యాలని అధికార వైసిపి ప్రయత్నం చేస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్న క్రమంలో తనపై తప్పుడు ట్వీట్ చేసిన మంత్రి అంబటి రాంబాబు పై సిఐడి అధికారులకు మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా ఫిర్యాదు చేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సోషల్ మీడియా పోస్టులపై రచ్చ కొనసాగుతుంటే ఇక దీని పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తనదైన శైలిలో స్పందించారు.












Click it and Unblock the Notifications