జూమ్ లోకి వస్తేనే మ్యూట్ చేసి పారిపోయావ్.. నేరుగా వస్తే తట్టుకోగలవా లోకేశం: సాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాల తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. తాజాగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో వైసీపీ నేతలు సడన్ గా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా లోకేష్ షాక్ అయ్యారు. పదో తరగతి ఫలితాలపైన విద్యార్థులతో, అటు తల్లిదండ్రులతో లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇక లోకేష్ విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ స్క్రీన్ మీదకు రావడం తో లైన్ కట్ చేసి జూమ్ మీటింగ్ ముగించారు లోకేష్. ఇక ఈ ఘటన పై అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శల పర్వం కొనసాగుతోంది.
టెన్త్ ఫలితాల మీద కూడా పేలాలు ఏరుకోవడం ఏమిటి పప్పూ : సాయిరెడ్డి
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై లోకేష్ ను టార్గెట్ చేశారు. టెన్త్ ఫలితాల మీద కూడా పేలాలు ఏరుకోవడం ఏమిటి పప్పూ అంటూ లోకేష్ ను ఎద్దేవా చేశారు. జులై 6-15 మధ్య మళ్లీ పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించినా పిల్లలతో జూమ్ మీటింగ్ పెట్టడం, 'ఏం కావట్లేదే' అనే శాడిస్టు బుద్ధి కనిపిస్తోందని మండిపడ్డారు. జూమ్ కాస్తా రసాభాసై మధ్యలోనే పారిపోయావుగా అంటూ లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా: సాయిరెడ్డి వ్యంగ్యం
అంతేకాదు జూమ్ లోకి వస్తేనే మ్యూట్ చేసి పారిపోయావ్. నేరుగా రమ్మని సవాల్ విసిరావే. డైరెక్ట్ గా వస్తే తట్టుకోగలవా లోకేశం? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లోకేష్ ను ప్రశ్నించారు. చిన్న పిల్లలతో రాజకీయం చెయ్యడం కాదు. పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా అంటూ తనదైన శైలిలో లోకేష్ పై సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.
చంద్రబాబు, లోకేష్ ల ఫెయిల్యూర్ పై సాయిరెడ్డి పంచ్
ఇదే సమయంలో పొలిటికల్ మిర్చి పేరుతో వేసిన సెటైర్లో విజయ సాయి రెడ్డి టెన్త్ స్టూడెంట్ ఫెయిల్ కాదు జగన్ సర్కార్ ఫెయిల్యూర్ అంటూ టిడిపి నేతలు చంద్రబాబు, నారా లోకేష్ లు విద్యార్థులకు అండగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చెబుతున్నారని, ఇక వారి తీరు ఎలా ఉందంటే కుప్పంలో ఓడిపోయిన బాబు, తాను అక్కడ ఫెయిల్ కాలేదు, అది కుప్పం ప్రజల ఫెయిల్యూర్ అంటూ చెప్పినట్టు, ఇక మంగళగిరిలో ఓటమిపాలైన లోకేష్ అది మంగళగిరి ప్రజల ఫెయిల్యూర్ అంటూ చెప్పినట్టు పంచ్ వేశారు.
చంద్రబాబు కుప్పంలో, లోకేష్ మంగళగిరిలో గెలిస్తే చాలన్న సాయిరెడ్డి
ఇక తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ 175 అంటూ అన్నిచోట్లా విజయమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తే, టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, మంగళగిరి ఎమ్మెల్యే అయితే చాలు అని లోకేష్ భావిస్తున్నాడు అంటూ నాకౌట్ పేరుతో సెటైర్ వేశారు విజయసాయిరెడ్డి. ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా సరే సాయిరెడ్డి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.