ఏపీకి ఎంఫాన్ గండంః దూసుకొస్తున్నతుఫాన్..72 గంటల్లోః దిశ మారొచ్చంటోన్న ఐఎండీ
విశాఖపట్నంః ఇప్పటికే కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని పోయిన ఏపీకి మరో గండం పొంచివుంది. బంగాళాఖాతంలో అండమాన్కు దక్షిణదిశగా ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారబోతోందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నాటికి ఋ అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన తుఫాన్గా ఆవిర్భవిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ తుఫాన్కు ఎంఫాన్గా నామకరణం చేశారు. కరోనా వైరస్ పెను ప్రభావాన్ని చూపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తుఫాన్ ఏర్పడటం వల్ల మరింత ముప్పు ఉంటుందనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.
Recommended Video
72 గంటల్లో పెను తుఫాన్గా రూపొందే అవకాశం..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరో 72 గంటల్లో అది వాయుగుండంగా మారడానికి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండంగా మారిన తరువాత అది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ (ఈసీఎండబ్ల్యూఎఫ్) అంచనా ప్రకారం..ఈ నెల 13వ తేదీ నాటికి మయన్మార్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ప్రభావం వల్ల ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
మూడు రాష్ట్రాలకు అప్రమత్తత
ఈ మూడు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకూడదని పేర్కొంది. తుఫాన్ ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. ఎంఫాన్ తుఫాన్ సంకేతాలు అందిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడిన ప్రతీసారీ ఒడిశా దాని బారిన పడుతుంటుంది. ఈ సారి ఎంఫాన్ ముంచుకొచ్చే పరిస్థితులు తలెత్తడంతో తీర ప్రాంత జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
విశాఖను కమ్మేసిన మబ్బులు
వాతావరణ శాఖ అంచనాలను నిజం చేసేలా.. విశాఖపట్నంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకూ ఎండ తీవ్రత కనిపించిన విశాఖ సాయంత్రానికి పూర్తిగా చల్లగా మారింది. రామకృష్ణా బీచ్ సహా తీర ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. ఆకాశాన్ని మబ్బులు కమ్మేశాయి. ఆర్కే బీచ్ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. తుఫాన్ ముందు నాటి ప్రశాంతతను గుర్తుకు తీసుకొచ్చింది. నిత్యం రద్దీగా ఉండే ఆర్కే బీచ్ లాక్డౌన్ ప్రభావం వల్ల నిర్మానుష్యంగా మారింది. ఫలితంగా- ఇదివరకెప్పుడూ లేని ప్రశాంత వాతావరణం తీర ప్రాంతంలో కనిపించింది.
తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు..
తుఫాన్ ప్రభావం వల్ల వచ్చే 72 గంటల సమయంలో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కెరటాలు సాధారణ రోజుల కంటే ఎక్కువ ఎత్తు వరకు ఎగిసిపడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాటిని అకాల వర్షాలుగానే భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే విశాఖపట్నం సహా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. వాటి నుంచి కోలుకోక ముందే.. ఈ అల్పపీడనం పొంచివుండటం వల్ల రైతాంగానికి మరింత నష్టం సంభవించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.