జాగ్రత్తగా ఉండు: బాబు, తప్పేంటి: 'వెధవ' జేసీ ప్రశ్న
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి 42 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఉంటే గౌరవం ఇప్పుడు లేదన్నారు. ప్రాధాన్యత లేదనే ఆవేదన తెలంగాణ ఎంపీలలో కూడా ఉందని చెప్పారు. మహాతల్లి సోనియా గాంధీ మూర్ఖంగా రాష్ట్రాన్ని విభజించారన్నారు.
జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఎవరికీ సానుభూతి లేదని, ఎన్ని చేసినా ప్రయోజనం కనిపించడం లేదని జేసీ గురువారం వ్యాఖ్యానించారు.
వీటిపై జేసీ వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, ముఖ్యమంత్రులను కించపరచలేదని చెప్పారు. వ్యవస్థలో ఉన్న లోపాల గురించే తాను మాట్లాడానని చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు తనకు సూచించారని చెప్పారు.
తాను నిన్న చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని చెప్పారు. ఢిల్లీలో ఎంపీలకు ప్రాధాన్యం లభించడం లేదని చెప్పారు. ఇదే విషయాన్ని తాను చంద్రబాబుకు చెప్పానని తెలిపారు. నదీజలాల పైన తెలుగు రాష్ట్రాలు పొట్లాడుకుంటూ రాయలసీమకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వనప్పుడు ముఖ్యమంత్రులను, ప్రధానులను నేరుగా ఎన్నుకునే వ్యవస్థ ఉంటే ఏమిటన్నారు. చంద్రబాబు చుట్టూ వెధవలు ఉన్నారన్న తన వ్యాఖ్యల పైన ఆయన వివరణ ఇచ్చారు. చంద్రబాబు చుట్టూ వెధవలన్న వ్యాఖ్యలపై తప్పేమి లేదన్నారు. పనులు చేసుకునేందుకు ఎంపీలే కానవసరం లేదన్నారు. ప్రజాసేవ కోసమే ఎంపీలం అయ్యామన్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీలో మిగిలింది అరువు గాంధీలేనని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేరని జేసీ దీవాకర్ రెడ్డి గురువారం అన్నారు. మాట నిలుపుకున్నాడు కాబట్టే కేజ్రీవాల్కు పట్టం గట్టారన్నారు. ఏసీలో నిద్రపోవడానికి ఢిల్లీకి వెళ్లాలా అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులను పట్టించుకోవడం లేదని ఆయన గురువారం మీడియాతో అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న తనలాంటి వాళ్ల సలహాలను కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన దృష్టిలో చట్ట సభలు వృధాగా మారిపోయాయని ఆయన అన్నారు.
కేంద్రం మాట విననప్పుడు పార్లమెంటు సభ్యుల ఎన్నిక ఎందుకని ఆయన అడిగారు. ఎంపిల ఎన్నికలు నిర్వహించడానికి బదులు నేరుగా ప్రధానినే ఎన్నుకోవచ్చు కదా అని ఆయన అన్నారు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ బిజెపి ఊడ్చేసిందని, ఆప్ దెబ్బకు బిజెపి ఊడ్చుకుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా పోయిందని జెసి అన్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఇది తాము సాధించామని చెప్పుకోవడానికి పార్లమెంటు సభ్యులుగా తమకేమీ లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం ఈ దేశానికి పనికి రాదని ఆయన అన్నారు.
ఎంపి, ఎమ్మెల్యేల ఎన్నికలు ఈ దేశానికి దండుగ అని ఆయన అన్నారు. దేశానికి ప్రధాని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే సరిపోతుందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అవసరం లేదని ఆయన అన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి చెప్పినవే శాసనాలుగా మారిపోతున్నాయని ఆయన అన్నారు.
చంద్రబాబు ఏదైనా మంచి చేస్తే ఇది బాగా చేశావని చెప్పే ప్రతిపక్షాల నాయకులు ఎవరైనా ఉన్నారా అని ఆయన అడిగారు. దేశమంతా ఒక ప్రదానిని, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఎన్నుకోండని ఆయన అన్నారు. తెలుగు ఎంపీలను ఢిల్లీలో కరివేపాకులా చూస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మీద ఏ ఒక్కరికైనా సానుభూతి ఉందా అని ఆయన అడిగారు.
చంద్రబాబు మంచి చేస్తున్నారని ప్రజలు అనుకోవడం లేదని ఆయన అన్నారు. నీటి సమస్యను పరిష్కరించడం చంద్రబాబు ఒక్కరి వల్ల సాధ్యం కాదని ఆయన అన్నారు. నీటిపారుదలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుని నదుల అనుసంధానం చేస్తే పేదరికం పోతుందని జెసి అన్నారు.
ఇంత మెజార్టీతో మెజారిటీతో గెలిచాం, ఇది సాధించామని చెప్పడానికి ఏమీ లేకుండా పోయిందని ఆయన అన్నారు. అవినీతి నిర్మూలనపై ప్రధాని మోడీ గతంలో ఇచ్చిన హామీని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి కోటి సంతకాలతో ఏం ఉద్దరిస్తారని మండిపడ్డారు. అరువు గాంధీలున్నంత వరకు కాంగ్రెస్ బాగుపడదన్నారు.












Click it and Unblock the Notifications