ఏపీకి ఏ మేరకు లబ్ది చేకూరుతుందో కేంద్ర ప్యాకేజీ పై స్పష్టత రావాల్సి ఉంది : మంత్రి గౌతమ్ రెడ్డి
కేంద్రం ప్రకటించిన 3 లక్షల కోట్ల ప్యాకేజీపై అన్ని రాష్ట్రాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి . అయితే ఇంకా ఈ ప్యాకేజీతో ఆంధ్ర ప్రదేశ్ కు జరిగే ప్రయోజనం ఏమిటో తెలీదని , ఇంకా దీనిపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి గౌతమ్ రెడ్డి . లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) కేంద్రం ప్యాకేజీ ప్రకటించిందని అయితే ప్యాకేజీకి సంబంధించిన మార్గదర్శకాలు రావాలన్నారు. అప్పుడే స్పష్టత వస్తుందని పేర్కొన్నారు .
ఎంఎస్ఎంఈ రంగానికి కేంద్రం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీని స్వాగతిస్తూ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి కేంద్ర ప్యాకేజీ రాష్ట్రానికి మేలు చేస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ఇదే సమయంలో కేంద్రం రాష్ట్రాల వారీగా ఆ ప్యాకేజీని అమలు చేస్తుందా లేదా అన్నది చూడాలన్నారు. 3 లక్షల కోట్ల ప్యాకేజీపై వీలైనంత వేగంగా మార్గదర్శకాలు రావాలని ఆయన కోరారు. రుణాలపై మారిటోరియం, టాక్స్ హాలిడే ప్రకటిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం ఆ దిశగా ఆలోచిస్తేనే పారిశ్రామిక రంగాన్ని ఆదుకోగలుగుతామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న శ్రామిక శక్తిని కొనసాగించడంతో పాటు, ఎంఎస్ఎంఇలలో ఉపాధి కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, రూ .200 కోట్ల లోపు కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించకూడదని కేంద్రం నిర్ణయించడంతో ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు.
ఎంఎస్ఎంఇలకు మద్దతు ఇవ్వడం గురించి కేంద్రం ప్రకటించిన చర్యలు మంచివని పేర్కొన్న ఆయన, ఆశించిన ఫలితాలను సాధించడానికి వాటి అమలుకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. 97 వేల ఎంఎస్ఎంఈలు రాష్ట్రంలో ఉన్నాయని ఇప్పటికే వాటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ప్యాకేజీ అమలుకు చర్యలు చేపట్టామని, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించటానికి తగిన చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. ఇక కేంద్ర మార్గదర్శకాలు వస్తేనే ఎంత మేలు జరుగుతుందో చెప్పగలమని పేర్కొన్నారు.