కెసిఆర్కు మోకరిల్లారు, లోకేష్కు పట్టాభిషేకం చేయడానికే: చంద్రబాబుపై ముద్రగడ
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసు నుంచి బయపడడానికి చంద్రబాబు ప్రత్యేక హోదాను అమ్మేశారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.
కేసు నుంచి తప్పించుకోవడానికి ఆహ్వానం పేరిట చంద్రాబబు వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వద్ద మోకరిల్లారని ఆయన అన్నారు. రాజధాని శంకుస్థాపనను చంద్రబాబు తన కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారని, తన కుమారుడు నారా లోకేష్ పట్టాభిషేకం కోసమే రాజధాని పేరిట హంగూ ఆర్భాటాలు చేశారని ఆయన అన్నారు.

రాజధాని శంకుస్థాపనలో కేవలం ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే భాగస్వామిని చేశారని, ప్రజల డబ్బును మంచినీళ్ల కన్నా దారుణంగా ఖర్చు పెట్టారని ఆయన విమర్శించారు. భూసేకరణ, సమీకరణ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆయన ఆరోపించారు.
రాజధాని నిర్మాణాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించడంపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ప్రధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకపోవడం ఎపి ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications