జగన్ సాయం గుర్తుకొచ్చి ముద్రగడ గిరి కన్నీళ్లు.! అలా వచ్చుంటే క్రాంతికి ఎంట్రీ..!
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (mudragada padmanabham) అంత్యక్రియ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన కుమారుడు ముద్రగడ గిరి (mudragada giri) ఇవాళ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచీ చనిపోయేవరకూ ఎలాగైనా బతికించాలని జగన్ చేసిన ప్రయత్నం ఇంతా అంతా కాదన్నారు. ఎప్పుడూ తనకు ఫోన్ చేసి గిరీ, ఏం కావాలని తనను అడిగేవారని, డాక్టర్లకు కూడా ఫోన్ చేసి ప్రపంచంలో ఆయనకు పనిచేసే మందు ఎక్కడున్నా తెప్పించాలని, డాక్టర్లను కూడా రప్పించాలని ప్రతీసారీ చెప్పిన జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఒక్క క్షణం ఉందని, ఆ క్షణం గుర్తుకొచ్చిన ప్రతీసారీ మనసు ఉప్పొంగుతుందని ముద్రగడ గిరి తెలిపారు. తన తండ్రి చనిపోయినప్పుడు, జగనే స్వయంగా వచ్చి పాడె మోయడం తాము ఎప్పటికీ మర్చిపోలేమంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా జగన్ చేసిన ఈ పని రాజకీయాల కోసమో, పబ్లిసిటీ కోసమే, ఓట్ల కోసమో చేసింది కాదన్నారు. ప్రతీ తండ్రికీ ఓ కుమారుడు ఇచ్చే గౌరవం అన్నారు. వైఎస్సార్సీపీలో చేరినప్పుడు తనకు వైఎస్ భారతి ఓ పెద్ద వ్యక్తితో కబురు పంపించారని, జగన్మోహన్ రెడ్డి ముద్రగడను తండ్రిలా చూసుకుంటారని చెప్పారని, తన తండ్రి స్ధానం పద్మనాభానికి ఇస్తారని చెప్తే సానుభూతి కోసమో, భరోసా కోసమో అనుకున్నామని, కానీ అది జగన్ మనసులో నుంచి వచ్చిన మాట అని చెప్పేలా ఆయన ప్రవర్తన ఉందన్నారు. ఎన్ని జన్మలెత్తినా జగన్ రుణం తీర్చుకోలేమని గిరి వెల్లడించారు.

మరోవైపు ముద్రగడ అంత్యక్రియల రోజు జరిగిన పరిణామాలతో అంబటి రాంబాబుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అంబటి రాంబాబుపై కేసు పెట్టడం సరికాదన్నారు. ముద్రగడ అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు వద్దని చెప్పడం పూర్తిగా తమ కుటుంబ నిర్ణయమేనని, ఇందులో అంబటికి కూడా సంబంధం లేదన్నారు. అటు తన తండ్రి కోరిక మేరకే సోదరి క్రాంతిని ముద్రగడ అంత్యక్రియలకు రానివ్వలేదన్నారు. తన సోదరి క్రాంతి పోలీసులతో పాటు ఓ 50 మంది బౌన్సర్లతో, రౌడీలతో, గూండాలతో వచ్చిందని తనకు సమాచారం ఉందని గిరి తెలిపారు. ఇలాంటి వారిని క్షమించకూడదన్నారు. ఇలాంటి వారు సమాజానికి చీడ పురుగులే అన్నారు. ఇలాంటి వాళ్లను ఎవరినీ తాను ఎప్పటికీ మర్చిపోనన్నారు. కుటుంబ సభ్యులతో వచ్చి ఉంటే ఆ గౌరవం వేరని, తన తండ్రి మాట పక్కనబెట్టి, తల్లిని ఒప్పించి అయినా తండ్రి భౌతిక కాయం చూపించేవాడినన్నారు. ఇలాంటి వాళ్లు సమాజం మంచి కోరే వాళ్లు కాదన్నారు. జనసేన పార్టీ క్రాంతిని వాడుకుంటుందో లేదో తెలియదు కానీ, ఆమె మాత్రం పార్టీని, పవన్ కళ్యాణ్ ను వాడుకుంటోందన్నారు.












Click it and Unblock the Notifications