'తుని' ఘటన బాబు రౌడీల పనే, నేను.. నా భార్య ఆమరణ దీక్ష చేస్తున్నాం: ముద్రగడ సంచలనం
కిర్లంపూడి: తుని ఘటన పైన కాపు నేత ముద్రగడ పద్మనాభం సోమవారం నాడు అనుమానం వ్యక్తం చేశారు. ఆయన మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. కాపు ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. నిన్నటి ఘటన పైన ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
తాను కాపు గర్జన తేదీ ప్రకటించగానే ఎదురు దాడి మొదలయ్యిందని చెప్పారు. తమ జాతి అమ్ముడు పోయే జాతిలా చేస్తున్నారని విమర్శించారు. తాను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేశానని చెప్పారు. అప్పుడు తనను టిడిపి ఎన్ని కోట్లకు కొన్నదో చెప్పాలన్నారు.
కాపు ఉద్యమాల నేత: ఎవరీ ముద్రగడ?
తనను ప్రతిపక్షాలు కొనుగోలు చేశాయని చెప్పడం విడ్డూరమన్నారు. గతంలో తనను టిడిపి నేతలు కొనుగోలు చేసినట్లేనా అని ప్రశ్నించారు. మా కుల సోదరులతోనే ఈ ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. కాపు జాతి అమ్ముడు పోయినట్లు ప్రచారం చేయడం బాధాకరమన్నారు.
కాపు గర్జన పైన చంద్రబాబు ఎదురు దాడికి పాల్పడ్డారన్నారు. మా కుల సోదరులతో ఎదురు దాడి చేయించడమే కాకుండా, కొన్ని చోట్ల రౌడీలతో సమావేశాలు నిర్వహించినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఆ రౌడీలనే కాపు గర్జనకు పంపించారని ఆరోపించారు.
'తుని ఘటనలో జగన్ హస్తం': ఎప్పుడేం జరిగింది (పిక్చర్స్)
కాపులు ఇతరులను కొడతారనే భావన క్రియేట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారన్నారు. ఆ మేరకు రౌడీలకు ట్రెయినింగ్ ఇచ్చారన్నారు. నిన్నటి దమనకాండ వెనుక ఆ రౌడీలో ఉన్నారని తాను అనుమానిస్తున్నానని చెప్పారు.
తన వెనుక ఎవరో ఉండి చేయూత ఇస్తున్నారని చంద్రబాబు చెప్పడం ద్వారా... ఎవరికో తమ జాతి అమ్ముడు పోయారని చెప్పడం బాధాకరమన్నారు. నేను ఎక్కడికీ పారిపోనని, ఎక్కడా దాక్కోనని, నేను జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. మా జాతి, నేను అమ్ముడు పోయేది కాదన్నారు. జిల్లాలో 144 సెక్షన్ పెట్టడం సరికాదన్నారు.
కాపు ఉద్యమానికి నాయకత్వం వహించింది నేనేనని, కానీ తుని ఘటనకు బాధ్యత తనది కాదని, మీ నాయకులే ఆ ఘటనకు బాధ్యులని చెప్పారు. నేను నా భార్య ఆమరణ దీక్షకు సిద్ధమయ్యామని చెప్పారు. నన్ను అరెస్టు చేసుకోవచ్చునని, నా అరెస్టును ఎవరు అడ్డుకోరన్నారు. ఏ జైల్లో అయినా పెట్టుకోవచ్చన్నారు.
నా భార్యను కూడా జైలులో పెట్టుకోవచ్చన్నారు. తాను, తన భార్య.. జైలులో పెట్టినా ఆమరణ దీక్ష చేస్తామని ముద్రగడ ప్రకటించారు. తనను అరెస్టు చేస్తే బెయిల్ కూడా తీసుకోనని చెప్పారు. నాలుగైదు రోజుల్లో ఆమరణ దీక్ష చేస్తానన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీనే నెరవేర్చాలని అడుగుతున్నామన్నారు.