దాసరి, చిరుతో ముద్రగడ భేటీ: కాపు ఉద్యమం మళ్లీ ఊపందుకోనుందా?
హైదరాబాద్: ఏపీలో కాపు ఉద్యమం మళ్లీ ఊపందుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాపులను బీసీల్లో చేర్చాలంటూ గతంలో తన ఆమరణ దీక్షకు మద్దతిన అందరినీ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వరుసగా కలుస్తున్నారు. ఇందులో భాగంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను కలుస్తున్నారు.
సోమవారం హైదరాబాద్లో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును ఆయన ఇంట్లో కలిశారు. జూబ్లీహిల్స్లోని దాసరి నివాసానికి వెళ్లిన ముద్రగడ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన దీక్ష సందర్భంగా సంఘీభావం తెలిపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
కాపు రిజర్వేషన్లు, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభంతో పాటు కాపు నేతలు అంబటి రాంబాబు తదితరులు కూడా ఉన్నారు. దాసరితో భేటీ అనంతరం చిరంజీవిని కూడా ముద్రగడ పద్మనాభం కలవనున్నారు.
ఇదిలా ఉంటే రేపు దాసరి ఇంట్లో ముద్రగడతో పాటు కాపు సంఘానికి చెందిన పలువురు ప్రముఖ నేతలు మంగళవారం అధికారికంగా భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం కాపుల రిజర్వేషన్లకు సంబంధించి తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 11న కాపు సమావేశం
సెప్టెంబర్ 11వ తేదీన కాపుల సమావేశం ఉంటుందని ముద్రగడ పద్మనాభం చెప్పారు. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రాజమండ్రిలో 11వ తేదీన సభ ఉంటుందన్నారు. చంద్రబాబు ప్రయత్నిస్తేనే హోదా వస్తుందని, ఆయనతో పాటు ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయడానికి తాను కూడా సిద్ధమని చెప్పారు.