కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ముద్రగడ : కాపు -బీసీ-దళిత వేదికగా : జగన్ కు నష్టమా - లాభం ఎవరికి..!!
ఏపీలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దం అవుతోంది. ఏపీలో రాజకీయంగా గెలుపు ఓటముల్లో సామాజిక సమీకరణాలదే కీలక పాత్ర. అందునా గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించుకుంటేనే ఏపీలో అధికారం దక్కేది. కాపు ఉద్యమ నేత..సీనియర్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభవం కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ తో ఆయన ఉద్యమానికి నాయకత్వం వహించారు. కానీ, కొంత కాలం క్రితం నాయకత్వం నుంచి తప్పుకున్నారు.

ముద్రగడ కొత్త రాజకీయ అడుగులు
2014లో టీడీపీ మేనిఫెస్టోలో కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తుని వద్ద జరిగిన సమావేశం..రైలు దగ్ధం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో..2019 ఎన్నికల ముందు కేంద్రం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో 5 శాతం రిజర్వేషన్లను కాపు సామాజికవర్గానికి కేటాయించి..మిగిలిన 5 శాతం అగ్రవర్ష పేదలకు కేటాయిస్తూ టీడీపీ ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది.
కానీ, అది అమలు కాలేదు. ఇక, పాదయాత్రలో భాగంగా జగన్ కాపులను బీసీల్లో చేర్చే అంశంపైన తేల్చి చెప్పేసారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు విధి విధానాలు ఖరారు చేసారు. కొంత కాలంగా మౌనంగా ఉంటూ...అప్పుడప్పుడూ బహిరంగ లేఖలు రాస్తున్న ముద్రగడ ఇప్పుడు కొంత మంది ముఖ్యులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

సమీకరణాలు కలిసి వచ్చేనా
మెజార్టీ సామాజిక వర్గాలకు రాజకీయ అధికారమే లక్ష్యంగా కొత్తగా ప్రాంతీయ పార్టీ ఏర్పాటు దిశగా ఈ కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కాపు సామాజిక వర్గంతో పాటుగా బీసీలు..దళితులకు ప్రాధాన్యత ఇస్తూ ఈ పార్టీ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇందు కోసం దళిత.. బీసీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. సమావేశంలో పాల్గొన్న నేతలు సైతం దీనిని నిర్ధారించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రెండే పార్టీలు యాక్టివ్ గా ఉన్నాయని..మూడో ప్రత్యామ్నాయం అవసరమని అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇది పూర్తయి ..రాజకీయ పార్టీగా ఏర్పడితే జరిగే ఏపీ రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం చూపుతుందనే చర్చ సూతం మొదలైంది. కొద్ది రోజుల క్రితం రాజమండ్రి వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం రాజకీయంగా ఇదే సమీకరణం ఆధారంగా ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు.

పవన్ కళ్యాణ్ తో కలుస్తారా
ముద్రగడ వద్ద జరుగుతున్న చర్చల్లోనూ ఇదే రకమైన సామాజిక సమీకరణాలతో రాజకీయంగా ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకోవటంతో..పవన్ కళ్యాణ్ తో కలుస్తారా అనే చర్చ సైతం మొదలైంది. అయితే, ముద్రగడ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు చంద్రబాబు..ఇటు జగన్ తో కలిసే అవకాశాలు లేవని సమావేశంలో పాల్గొన్న నేతలు చెబుతున్నారు.
అయితే, 2019 ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు మొదలు..ఇప్పటి వరకు పార్టీ - ప్రభుత్వ పరంగా కేటాయించిన అన్ని పదవుల్లోనూ జగన్ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎస్సీ - మైనార్టీ మెజార్టీ ఓట్ బ్యాంక్ జగన్ వైపే ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

జగన్ - చంద్రబాబుల్లో ఎవరికి నష్టం చేసేను
దీంతో..బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ...బీసీలను సొంతం చేసుకొనేందుకు గతంలో టీడీపీ చేసిన ప్రయత్నాలు.. మరలా రిపీట్ కాకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. అయితే, ఇప్పుడు జనసేన కాపు ఓటింగ్ సాధించటంలో వెనుకబడి ఉందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ఈ సారి మాత్రం పరిస్థితి మారుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు..అనుకున్న విధంగా ముద్రగడ పార్టీ కార్యరూపం దాలిస్తే..అది ఏ పార్టీ కి లాభం .. ఎవరికి నష్టం చేస్తుందనే అంచనాలు మొదలయ్యాయి.
ఓటు బ్యాంకు చీలుతుందా.. చీలటం వలన వైసీపీకి మేలు జరుగుతుందా అనేది మరో చర్చ. అయితే, అసలు.. ముద్రగడ పార్టీ ప్రకటన.. వారి లక్ష్యాలు- అజెండా ప్రకటిస్తేనే..ఈ మొత్తం సమీకరణాల పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications