జగన్ సర్కార్ పై ముద్రగడ సెటైర్లు-ఆన్ లైన్ టికెట్లు సరే-బ్లాక్ మనీ తగ్గించే సూచనలివే..
ఏపీలో సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలన్న వైసీపీ సర్కార్ నిర్ణయం చర్చనీయాంశంగా మారుతోంది. బ్లాక్ టికెట్ల విక్రయాలను ఆపేందుకు సినిమా ఇండస్ట్రీ పెద్దల కోరిక మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతుండగా.. విపక్షాలు మాత్రం ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్ముకోవడమేంటని సెటైర్లు వేస్తున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ స్పందించారు. ఇదే అంశంపై సీఎం జగన్ కు ఆయన ఓ లేఖ రాశారు.
సినిమా టికెట్లు ఆన్ లైన్లో విక్రయించేలా చూడాలని ఎమ్మెల్యే రోజాతో పాటు మరికొందరు పెద్దలు చెప్పినట్లు పత్రికల్లో చూశానని, ఆ గౌరవ ప్రముఖ నటులు కోరిన విధానం చాలా మంచిదని ముద్రగడ తన లేఖలో తెలిపారు. ఇదే కోవలో ఓ మాజీ ఎగ్జిబిటర్ గా తాను చేసిన కొన్ని సూచనల్ని కూడా అందరూ గౌరవించాలని ముద్రగడ కోరారు. ఆన్ లైన్లో టికెట్లు అమ్మి ఇండస్ట్రీని ఆదుకున్నట్లే.. సినిమా కోసం పనిచేసే హీరో, హీరోయిన్లు మొదలుకుని, ఆఖరి వ్యక్తి వరకూ వారికిచ్చే కిరాయిలు (రెమ్యునరేషన్లు) , క్యారవాన్ లు ( నటీనటులు సేద తీరే వాహనాలు), ఇతర వాహనాలకు, రూమ్ అద్దెలకు, టిఫిన్లు, భోజనాలు వగైరా అన్నింటికి నిర్మాత గారి నుంచి మొత్తం డబ్బంతా ప్రభుత్వమే జమ చేయించుకుని, ఆన్ లైన్టో టికెట్ల మాదిరిగా వీరి బ్యాంకు ఖాతాల్లోకి పంపిస్తే బావుంటుందని ముద్రగడ జగన్ సర్కార్ కు చురకలు అంటించారు.
దీనివల్ల దుబారా, ఎగవేతలు ఉండవని ఏపీ ప్రభుత్వానికి ముద్రగడ సూచించారు. ప్రతీ పైసా ఖర్చు, వివరాలు అద్దంలో చూసుకున్నట్లు ఉంటుందన్నారు. ఎక్కడా తెలుపు, నలుపు ధనం పదాలు వినపడవన్నారు. పూర్తిగా వైట్ మనీతోనే వ్యాపారం జరుగుతుందని ముద్రగడ తెలిపారు. దీంతో సినిమా నిర్మాణానికి పెడుతున్న కోట్ల రూపాయల ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. దయచేసి గౌరవ నటుల సూచనలతో పాటు ఈ సూచన కూడా పరిగణనలోకి తీసుకుని ఆలోచించమని జగన్ సర్కార్ ను ముద్రగడ కోరారు.

ఇప్పటికే జగన్ సర్కార్ హీరోల కోరిక మేరకు ఆన్ లైన్ టికెట్లు అమ్ముతున్నట్లు చెప్పుకుంటున్న నేపథ్యంలో ముద్రగడ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీరికి ఇచ్చే కోట్లాది రూపాయల రెమ్యునరేషన్లతో పాటు మిగతా ఖర్చులు కూడా నిర్మాతల నుంచి తీసుకుని మీరే పేమెంట్లు చేసేయాలని ముద్రగడ వేసిన సెటైర్లు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. తద్వారా బ్లాక్ మనీ సమస్య తీరి అంతా వైట్ మనీ అవుతుందని జగన్ సర్కార్ కు ముద్రగడ చురకలు అంటించడంపై టాలీవుడ్ లోనూ చర్చ జరుగుతోంది.
ఇవాళ ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పెద్దలతో రాష్ట్ర సచివాలయంలో ఆన్ లైన్ టికెట్ల విక్రయాలపై సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ముద్రగడ వేసిన సెటైర్లు జగన్ సర్కార్ కు సూటిగా తగిలేలా ఉన్నాయి. మరి దీనిపై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక దూకుడు తగ్గించారని విమర్శలు ఎదుర్కొంటున్న ముద్రగడ సంధించిన తాజా విమర్శలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో జగన్ కు ఇదే చివరి లేఖ అని చెప్పిన ముద్రగడ తాజాగా మరో లేఖ సంధించడం మరో విశేషం.












Click it and Unblock the Notifications