అసెంబ్లీ ఉన్నది మీ డబ్బా కొట్టుకోవడానికా? మీవల్ల ఏ జాతి బాగుపడింది?: ముద్రగడ
కాకినాడ: ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. తమ జాతికి విస్తరాకులు మాత్రమే వేశారు కానీ.. అందులో ఏమి వడ్డించలేదని సీఎంకు చురకలంటించారు.
కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినట్టు అసెంబ్లీలో చెప్పుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. తమరు తీర్మానం చేసి పంపిన బిల్లును కేంద్రం నుంచి తిరిగి వచ్చిన సంగతి మీకు తెలియలేదా? అని ప్రశ్నించారు. తహశీల్దారు కార్యాలయానికి వెళ్తే.. ఇవాల్టికీ మా జాతి బీసీ-ఎఫ్ ధ్రువీకరణ పత్రం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవన్నీ పక్కనపెట్టి తమరు అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పడం సిగ్గుచేటని చంద్రబాబును ముద్రగడ విమర్శించారు. మీ కష్టం వల్ల రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని మీకు మీరే డబ్బా వాయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఏ జాతి ఎక్కడ సుఖంగా ఉందో చెప్పగలరా? అని ముద్రగడ చంద్రబాబును ప్రశ్నించారు. కేవలం తమరి సహకారం ఉన్న కొన్ని కుటుంబాలు మాత్రమే సుఖంగా ఉన్నాయన్నారు. తనకు తెలిసినంతవరకు చంద్రబాబు కుటుంబం, ఆయన సామాజిక వర్గంలోని కొందరు తరతరాలుగా తరగని ఆస్తిపాస్తులు సంపాదించుకున్నారని అన్నారు.
మీకు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు.. వేరేవాళ్లకు అమ్ముడుపోయారని బురదజల్లుతారు అంటూ మండిపడ్డారు. అసెంబ్లీని మీ డబ్బా కొట్టుకోవడానికి ఉపయోగించుకోవద్దని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ అంటే దేవాలయంలా చూడాలని హితవు పలికారు. తమరి పాలన చరమాంకానికి వచ్చింది కాబట్టి.. ఇకనైనా గత ఎన్నికల సమయంలో తమ జాతికి ఇచ్చిన హామిలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications