చంద్రబాబుపై హత్య కేసు ఎందుకు పెట్టరు?: 'అప్పట్లో బస్సులు తగలబెట్టండని చెప్పాడు'
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా తుని విధ్వంస ఘటనలో పెట్టిన కేసులను ఉపసంహరించుకోకపోతే మళ్లీ నిరాహార దీక్షకు దిగుతానని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. కాపులపై పెట్టిన కేసులను బుధవారం సాయంత్రానికి ఉపసంహరించుకోకపోతే 9వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు నిరాహార దీక్ష చేపడతానని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.
ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడిలో మంగళవారం రాత్రి 8 గంటలకు ముద్రగడ మీడియాతో మాట్లాడారు. బుధవారం సాయంత్రానికి కేసులు ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే 9వ తేదీ ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన ఇంట్లోనే నిరాహారదీక్షకు కూర్చుంటానని ప్రకటించారు.
తుని ఘటనకు సంబంధించి కేసుల ఉండవని గతంలో ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడంలేదని చంద్రబాబుని ప్రశ్నిస్తుంటే వేధిస్తున్నారని అన్నారు. బాబుకు భజన చేసే నేతలతో తనను దారుణంగా తిట్టిస్తున్నారని, కాపు సోదరులను విడదీస్తున్నారని విమర్శించారు.
హామీలు ఇచ్చిన చంద్రబాబు తన బాధ్యతను విస్మరించినా, తాను మాత్రం కాపు జాతి కోసం పోరాటం ఆపబోనని స్పష్టం చేశారు. విజయమో.. వీరస్వర్గమో తేల్చుకుంటానని ఒకింత ఆగ్రహంతో చెప్పారు. తనను హెలికాప్టర్లో తరలించాలని చూశారన్నారు. తుని ఘటనలో రౌడీషీటర్లు, ఖూనీకోర్లు ఉంటే ఆ కేసులు వేరేగా చూసుకోవాలని అన్నారు.
కాపులకు రిజర్వేషన్లు కోరుతూ తలపెట్టిన కాపు ఉద్యమం సభకు వచ్చిన వారిని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. కాగా ఇటీవల జరిగిన గోదావరి పుష్కరాల సమయంలో తన ఇమేజిని పెంచుకోవం కోసం 29 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఏపీ సీఎం చంద్రబాబుపై నేటి వరకు ఎటువంటి కేసులను ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
అంతమంది మృతికి కారకుడైన చంద్రబాబుపై హత్య కేసు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. ఈ ఘటనపై కమిటీలు వేశామని చెప్పడం, వారు వచ్చి వెళ్లిపోతున్నా ఎటువంటి కేసులు నమోదు చేయలేకపోయారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబుపై పుష్కరాల తొక్కిసలాటపై 302 కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తుంటే కేసులు పెట్టి అరెస్టులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. కాపు జాతి నాయకుల అరెస్టులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం నుంచి తక్షణమే ప్రకటన రావాలని అన్నారు. తమ జాతిని రోడ్డుమీద పడేసి తాను ఇంట్లో పడుకునే మనిషిని కాదని, చంద్రబాబు తన జీవితంతో ఆడుకుంటున్నారని.. అవసరమైతే తన జీవితం తీసుకోమని కోరుతున్నానని చెప్పారు.
ప్రభుత్వం తనను మానసికంగా వేధిస్తోందని, ఆ వేధింపులను తాను తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. తమ జాతితోపాటు ఇతర జాతులు కూడా ఉద్యమానికి సహకరించారని, వారిని కూడా రక్షించుకోవల్సిన అవసరముందని తెలిపారు. 1984లో ఎన్టీఆర్ని దింపేసినపుడు.. బస్సులు తగలబెట్టండంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది చంద్రబాబేనని ఆరోపించారు.
పరిటాల రవీంద్రను చంపుతారని తెలిసినా కాపాడలేదని, దీన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూశారంటూ చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. ఇదంతా చూస్తుంటే తుని విధ్వంసం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని ముద్రగడ ఆరోపించారు. విధ్వంసాలు సృష్టించడం, మోసాలు చేయడం వంటివి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తీవ్ర విమర్శలు చేశారు.