హైడ్రామా: మొండికేసిన ముద్రగడ, ఆయన ఇంటికి తాళం
హైదరాబాద్: తుని ఘటనలో అరెస్టులను నిరసిస్తూ అమలాపురం పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగిన కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు కిర్లంపూడికి తరలించారు. ఈ సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు వ్యాన్ దిగేందుకు ముద్రగడ నిరాకరించారు. తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేసేంత వరకు తాను వ్యాన్లోనే ఉంటానని ఆయన మొండికేశారు.
బలవంతంగా దించాలని చూస్తే ఇక్కడే దీక్షకు కూర్చుంటానని ఆయన హెచ్చరించారు. ముద్రగడ అనుచరులు ఆయన ఇంటి గేట్లు మూసివేసి తాళాలు వేశారు. ఆయనకు మద్దతుగా కిర్లంపూడికి పెద్ద యెత్తున కాపులు చేరుకుంటున్నారు. దాంతో భారీగా పోలీసులను మోహరించారు.
తుని విధ్వంసం కేసులో అరెస్టులను నిరసిస్తూ కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అమలాపురం పోలీసు స్టేషన్ ముందు మంగళవారం ఉదయం ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు పది మందిని అరెస్టు చేసి, మంగళవారం కోర్టులో హాజరు పరిచే ఉద్దేశంతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ముద్రగడ ధర్నాకు దిగారు. అమాయకులను అరెస్టు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ ఘటన విషయంలో తన బాధ్యత ఉంది కాబట్టి తొలుత తనను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ స్థితిలో అమలాపురానికి పెద్ద యెత్తున కాపు నాయకులు చేరుకుంటున్నారు.

పెండ్యాల రామకృష్ణ, శ్రీనివాస రావు, ఫణి, ముదిగొండ పవన్ కుమార్, మహేశ్, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. మరింత మందిని అదుపులోకి తీసుకని ప్రశ్నిస్తున్నారు. అమాయకులను అరెస్టు చేస్తున్నారు కాబట్టి తొలుత తనను అరెస్టు చేయాలని, అందుకే తాను పోలీసు స్టేషన్కు వచ్చానని ముద్రగడ పద్మనాభం అంటున్నారు.
మూడు దఫాలుగా విచారణ జరిపి పోలీసులు తుని ఘటనలో నిందితులను అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. పక్కా ఆధారాలతోనే ఆరెస్టులు చేశామని వారు చెబుతున్నారు.
ఉద్యమానికి కర్త,కర్మ, క్రియ అన్నీ తానేనంటూ ముందు తను అరెస్టు చేయాలని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. తనను అరెస్టు చేసిన తర్వాత కార్యకర్తల విషషయం చూడాలని ఆయన అన్నారు ముందు నాయకులను అరెస్టు చేయాలని అన్నారు. అరెస్టు చేసినవారిని విడుదల చేసే వరకు ఆందోళన ఆగదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications