"ఓరీ జాత్యహంకారి ట్రంప్.. కుక్క చావు ఖాయం నీకు.."
'ఓరీ జాత్యహంకారీ డొనాల్డ్ ట్రంప్.. నీవల్ల నిష్కారణంగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పాపం నీకు తప్పకుండా తగులుతుంది. నీవు చేసినటువంటి పాపాలకు ఫలితం చెబుతున్నా విను'
హైదరాబాద్: అమెరికాలో భారతీయులపై వరుసగా జరుగుతున్న జాత్యహంకార దాడుల పట్ల దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారిపై ఇటీవల అమెరికాలో జరిగిన వరుస ఘటనలు తెలుగు ప్రజలను కలవరపెడుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై స్పందించిన పంచాంగకర్త, ప్రముఖ సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు శాపనార్థాలు పెట్టారు. ట్రంప్ కుక్క చావు చస్తాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ జాతక చక్రం ప్రకారం ప్రస్తుతం ఆయనకు ఏలినాటి శని నడుస్తోందని, దీని ప్రభావం వల్ల ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగలేరని జోస్యం చెప్పారు.
'ఓరీ జాత్యహంకారీ డొనాల్డ్ ట్రంప్.. నీవల్ల నిష్కారణంగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పాపం నీకు తప్పకుండా తగులుతుంది. నీవు చేసినటువంటి పాపాలకు ఫలితం చెబుతున్నా విను. ఇదే నీకు నేనిచ్చే శాపం. నీ అంత్య కాలంలో నీ మరణ సమయంలో, నీ సన్నిహితులు గానీ, నీ మిత్రులు గానీ, నీ భార్య గానీ, నీ బంధువులుగానీ ఎవరూ లేకుండా, అనాధ లాగా కుక్క చావు చస్తావు. నా మాటకు తిరుగులేదు' అని శాపం పెట్టారు.
కాగా, ఇటీవల కూఛిబొట్ల శ్రీనివాస్ అనే తెలుగు వ్యక్తి అమెరికా జాత్యహంకార దాడిలో బలైపోయిన సంగతి తెలిసిందే. ఈరోజు తెలంగాణకు చెందిన మరో మహిళపై అమెరికాలో దాడి జరగడం గమనార్హం.