ఈసారి న్యాయం: మురళీమోహన్, తగ్గం: యనమల
హైదరాబాద్: రైల్వే బడ్జెట్లో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఇక నుండి న్యాయం జరుగుతుందని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ చెప్పారు. ఈసారి రైల్వే బడ్జెట్లో ఎపికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారని తెలిపారు.
రైల్వే అవసరాలను కేంద్రానికి నివేదిస్తామన్నారు. కృష్ణపట్నం, నిజాంపట్నం, కళింగపట్నం పోర్టులను కలుపుతూ రైల్వే మార్గం అవసరమని, అందుకు అవసరమైన రైల్వే మార్గాన్ని నిర్మించాలని కేంద్రాన్ని కోరతామన్నారు.
రుణమాఫీపై తగ్గం: యనమల
రైతు రుణమాఫీపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం తెలిపారు. కష్టమైనా, నష్టమైన రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు. కోటయ్య కమిటీ ఇచ్చింది మధ్యంతర నివేదిక మాత్రమేనని, పూర్తి నివేదిక వచ్చిన తరువాత దానిపై సమగ్రమైన ప్రకటన చేస్తామన్నారు. మధ్యంతర నివేదికపై కేబినెట్ చర్చించిందని ఆయన తెలిపారు. రుణాలు ఎంత ఉన్నాయనేది కోటయ్య కమిటీ పూర్తిగా వెల్లడించిన తరువాత, ఎక్కువ మంది రైతులు లబ్ధిపొందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
గత ఏడాది బ్యాంకు రుణాలు చెల్లించి వారికి కూడా లబ్ది చెకూరేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకునేందుకు అనుకూలంగా రీ షెడ్యూల్ చేయాలని సూచించామన్నారు. రైతుల నుంచి పాత బాకీలు వసూలు చేయవద్దని, కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులను చెప్పామన్నారు. 25, 26న మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి ప్రధానిని కలిసి రాష్ట్రంలో ఇబ్బందులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారని చెప్పారు.
విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేసేందుకు కావాల్సిన వనరులును సమకూర్చాల్సిందిగా ప్రధానిని కోరుతామని తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్నారు. రుణమాఫీ వల్ల రూ.25 కోట్ల భారం పడుతుందని కమిటీ అంచనా వేసిందన్నారు.