రూ. 14 వేల కోసం ప్రేయసితో కలిసి వ్యక్తి హత్య
అనంతపురం: సమయానికి అప్పు ఇచ్చిన ఓ రిటైర్డ్ లైన్మన్ను 14 వేల రూపాయల కోసం హత్య చేసిన కేసును అనంతపురం జిల్లా ఆత్మకూరు పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.50 వేల విలువ చేసే బంగారు ఆభరణాలను, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డిఎస్పీ మల్లికార్జున వర్మ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం - ఈ ఏడాది జనవరి 20వ తేదీన ఆత్మకూరు మండలం పంపనూరు అటవీ క్షేత్రంలో ఓ రిటైర్డ్ లైన్మన్ కుసులూరు వీరన్న (70) హత్యకు గురయ్యాడు. పోలీసులు ఈ కేసు దర్యాప్తును ప్రారంభించారు. పక్కా సమాచారం అందడంతో పోలీసులు సోమవారం పామిడి మండలం కత్రిమలకు చెందిన బండి నాగేంద్ర, నీలం మాధవిని అరెస్టు చేశారు.
వీరన్న ట్రాన్స్లో లైన్మన్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. జెఎన్టియు సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి నిందితుల్లో ఒక్కరైన బండి నాగేంద్ర వరుసకు అల్లుడవుతాడు. నెల కిందట నాగేంద్ర వీరన్న వద్ద రూ. 14 వేలు అప్పు తీసుకున్నాడు. డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తుండడంతో ప్రియురాలితో కలిసి వీరన్నను హత్య చేశాడు.
పవిత్ర పరిసరాలను అపవిత్రం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని డిఎస్పీ మల్లికార్జున శర్మ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆత్మకూరు మండలం పంపనూరు పరిసరాలు పవిత్రమైనవని, ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకాలపాలకు, నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన అన్నారు.