తిరుమల శ్రీవారికి ముస్లీం భక్తుడి భారీ విరాళం, 'ప్రత్యేక దర్శనం రద్దు'
చిత్తూరు: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఓ భక్తుడు విరాళం ఇచ్చారు. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ఓ ముస్లిం భక్తుడు శ్రీవారికి కూరగాయల రథాన్ని విరాళంగా ఇచ్చారు. అతని పేరు అబ్దుల్ ఘనీ.
ఇతడు శ్రీవారి భక్తుడు. రూ.30 లక్షల విలువ చేసే కూరగాయల రథాన్ని తయారు చేయించి అతను శ్రీవారి ఆలయం ఎదుటకు తీసుకొచ్చారు. రథానికి పూజలు నిర్వహించి దేవస్థానం రవాణా శాఖకు అందించారు. ఈ లారీని కూరగాయల రవాణాకు వినియోగించనున్నారు.
ఈ సందర్భంగా అబ్దుల్ ఘనీని తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో చెన్నంగారి రమణ తదితరులు సత్కరించారు. అబ్దుల్ ఘనీ గతంలో తిరుమల అశ్వనీ ఆసుపత్రికి వైద్య పరికరాలు వితరణగా అందించారు.
తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో విఐపిల ప్రత్యేక దర్శనం సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. విఐపి దర్శనాలకు సిఫార్సు లేఖలు తీసుకు వచ్చినా అనుమతించేది లేదని చెబుతున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి 3వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఈవో సాంబశివ రావు వెల్లడించారు.