జగన్ అడగకముందే..: బాబు కేబినెట్లోకి మైనార్టీ ఎవరో!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో మైనార్టీ నేతను తన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ, టీడీపీల పొత్తు నేపథ్యంలో మైనార్టీల అభివృద్ధికి కూడా తాము కట్టుబడి ఉన్నామని చెప్పేందుకు చంద్రబాబు ఓ మైనార్టీ నేతను తన కేబినెట్లోకి తీసుకుంటారని అంటున్నారు.
టీడీపీకి 19 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. అందులో ఒక్క ముస్లీం నేత కూడా లేరు. ఎమ్మెల్యేలలోను ఒక్కరు ఆ వర్గానికి చెందిన వారు లేరు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు ఆ వర్గం వారు ఉన్నారు.
దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి ఎలాంటి ప్రశ్నలు రాకుండా ఉండేందుకు ఓ మైనార్టీ నేతను కేబినెట్లోకీ తీసుకోవచ్చునని అంటున్నారు. కేబినెట్లోకి తీసుకునే ఆ నేతను మండలికి పంపించే అవకాశముంది. ముస్లిం నేతను కేబినెట్లోకి తీసుకోకుంటే అది ఇబ్బందికర పరిణామంగా ఉండవచ్చునని టీడీపీ భావిస్తోందట.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. మైనార్టీల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలోను ఉంది. అయితే తన కేబినెట్లో ఆ ముస్లీం వర్గాలకు చోటు లేకపోవడంపై ప్రతిపక్షం ప్రశ్నించే అవకాశాలు మెండుగా ఉంటాయని భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలో కేబినెట్లోకి తీసుకునే నేత పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట. లిస్టులో పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. గతంలో మంత్రిగా పని చేసిన ఎండీ ఫరూక్ ఈ లిస్టులో ముందు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత షరీఫ్, గుంటూరు మాజీ ఎమ్మెల్యే జియాయుద్దీన్లు ఉన్నారు.