ఆళ్ల బాటలోనే మరో ఎమ్మెల్యే వసంత ? రాజీనామా వార్తలపై క్లారిటీ..!
ఏపీలో ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక వైసీపీ ఇన్ ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డిల రాజీనామాలు రాజకీయంగా కలకలం రేపాయి. ఎన్నికల నోటిఫికేషన్ కు కేవలం రెండు నెలల వ్యవధే ఉన్న నేపథ్యంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు రేపు టికెట్ రేసులో ఉన్న వైసీపీ ఇన్ ఛార్జ్ కూడా తమ పదవులకు గుడ్ బై చెప్పేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అదే సమయంలో మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా రాజీనామా చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి.
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు తన సొంత నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈసారి మైలవరం నుంచి పోటీకి జోగి రమేష్ సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో వసంతకు టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారాన్ని ఆయన ప్రత్యర్ధులు తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి సమయంలో వసంత రాజీనామా వార్తలు కలకలం రేపాయి. దీంతో ఆయనకు వరుసగా నేతలు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. విషయం ఆరా తీశారు.

చివరికి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సాయంత్రానికి దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను రాజీనామా చేశానంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఖండించారు. తను ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని వస్తున్న ఆరోపణలను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాను ఇవాళ మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం మండలంలో లంక భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నానని గుర్తుచేశారు.
అయినా కావాలని తనపై ఈ విధంగా కొంతమంది పని కట్టుకుని రాజీనామా చేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని వసంత కృష్ణప్రసాద్ మండిపడ్డారు. తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాననే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని తన వర్గం నాయకులకు, వైసీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications