నన్ను కలవండి - మంత్రి జోగి రమేష్, వసంత కృష్ణ ప్రసాద్కు జగన్ ఆదేశాలు
అమరావతి: ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ సహా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ కొద్దిసేపటి కిందటే ముగిసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో- వారికి దిశానిర్దేశం చేశారు. సమన్వయంగా పని చేయాల్సి ఉంటుందని హితబోధ చేశారు.

విభేదాలను విస్మరించి..
రాష్ట్రంలో మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయని, అత్యంత కీలకమైన సమయం అయినందున నాయకులందరూ కలిసికట్టుగా ఉండాలని, విభేదాలను విస్మరించి- పార్టీని గెలిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. మైలవరం నియోజకవర్గంలో సుమారు 89 శాతం మంది ప్రజలకు ప్రభుత్వం ద్వారా మేలు జరిగిందని పేర్కొన్నారు. 900 కోట్ల రూపాయల నగదును వివిధ సంక్షేమ పథకాల కింద నియోజకవర్గ ప్రజలకు అందజేసినట్లు చెప్పారు. ప్రతి కుటుంబం కూడా ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిందని అన్నారు.

175కు 175..
తమ టార్గెట్ 175కు 175 గెలవడమేనని వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. అది కష్టం కూడా కాదని తేల్చి చెప్పారు. కుప్పంలో గతంలో వేరే పార్టీ గెలవలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తాము జయకేతనాన్ని ఎగురవేశామని గుర్తు చేశారు. గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుని, క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా అవినీతికి తావు లేదని, అలాంటప్పుడు 175కు 175కు ఎందుకు సాధ్యం కాదని చెప్పారు.

సానుకూలంగా..
ఈ సమావేశం ముగిసిన అనంతరం వసంత కృష్ణ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. సానుకూల వాతావరణంలో తన నియోజకవర్గంపై సమీక్ష ముగిసిందని పేర్కొన్నారు. అన్ని విషయాల గురించి వైఎస్ జగన్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్పష్టంగా వివరించారని చెప్పారు. కార్యకర్తల అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారని, తాను చెప్పదలచుకున్నదీ స్పష్టం చేశారని అన్నారు. పార్టీ అభ్యర్థి గురించి ప్రకటన చేశారా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. తాను లేనిదే పార్టీ లేదని, పార్టీ లేనిదే తాను లేనని వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు.

జోగి రమేష్తో విభేదాల పరిష్కారం..
మంత్రి జోగి రమేష్తో తనకు విభేదాలు ఉన్నాయనే విషయాన్ని వసంత కృష్ణ ప్రసాద్ ఈ సందర్భంగా అంగీకరించారు. ఈ విషయం కూడా సమీక్ష సందర్భంగా ప్రస్తావనకు వచ్చిందని అన్నారు. ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో విభేదాలు ఉంటే పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. వారం రోజుల్లో జోగి రమేష్ను తనను తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావాలని సూచించినట్లు వసంత కృష్ణప్రసాద్ అన్నారు.

కుటుంబంలో విభేదాలు..
ఇంత పెద్ద వైఎస్ఆర్సీపీ కుటుంబంలో విభేదాలు సహజమేనని, కూర్చోబెట్టి మాట్లాడుకుంటే అన్నీ పరిష్కారమౌతాయని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. వాటన్నింటినీ సామరస్యపూరకంగా పరిష్కరించుకుంటామని తేల్చి చెప్పారు. చివరికి- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయమే శిరోధార్యమని వసంత స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications