రాజ్యసభకు విజయసాయి: జగన్కు మైసురా రెడ్డి ఝలక్?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి తిరిగి తెలుగుదేశం గూటికి చేరుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రాజ్యసభ సీటును ఆశించిన మైసురా రెడ్డికి ఆశాభంగం కలిగినట్లు చెబుతున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
జగన్ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురైన మైసురా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన గత కొంత కాలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు మైసురా రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
కడప జిల్లాకు చెందిన టిడిపి నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడుూ సిఎం రమేష్ మైసురా రెడ్డిని పార్టీలోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. సిఎం రమేష్ ప్రయత్నాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పచ్చజెండా ఊపినట్లు చెబుతున్నారు.
ఎమ్మెల్సీ సీటు ఇస్తామని మైసురా రెడ్డికి టిడిపి నాయకులు చెబుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కడపలోని కమలాపురం నియోజకవర్గం నుంచి మైసురా రెడ్డిని పోటీకి దింపాలనే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మైసురా రెడ్డి గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.