సొంత జిల్లా కొట్టుకుపోతున్నా పట్టించుకోరా.?సీఎంను సూటిగా ప్రశ్నించిన నాదెండ్ల మనోహర్.!
అమరావతి/హైదరాబాద్ : కరువు జిల్లాల కేంద్రం రాయలసీమలో భారీ వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయిన నిర్వాసితులు చెట్ల కింద బతుకుతుంటే ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా ఏరియల్ సర్వే నిర్వహించి వెళ్లిపోవడం చాలా దురదృష్టకరమన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సొంత జిల్లాకి కష్టం వస్తే స్వయంగా పర్యటించలేని ముఖ్యమంత్రి ఎందుకని నిలదీశారు.హెలీ కాప్టర్ వేసుకువచ్చి తిరిగి వెళ్లిపోయి ఎక్కడో కూర్చుని కబుర్లు చెబితే వరద బాదితుల కష్టాలు ఎలా తీరుతాయని మనోహర్ ప్రశ్నించారు.
ఎన్నికలు వస్తేనే మంత్రులు గ్రమాలకు వస్తారా..? విపత్తులప్పుడు రారా.?
ముఖ్యమంత్రి స్వయంగా దెబ్బ తిన్న గ్రామాల్లో పర్యటించి భరోసా కల్పించి ప్రభుత్వం నుంచి తక్షణం సహాయం అందించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. కడప జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రాంతాల్లో బుధవారం మనోహర్ పర్యటించారు. అన్నమయ్య డామ్ కట్ట దిగువ ప్రాంతంలో వరద ముంపుకు గురైన నందలూరు మండలం తొగురుపేటలో బాధితులను పరామర్శించారు. కూలిపోయిన ఇళ్లను పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు. వరద తీవ్రత, ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. బాధితులకు నిత్యావసరాలు, దుప్పట్లు, పాత్రలు అందించారు నాదెండ్ల మనోహర్.
ఇసుక మాఫియా స్వార్థంతోనే విపత్తు.. కళ్లు మూసుకున్న ప్రభుత్వమన్న మనోహర్
అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు వస్తే మండలానికో మంత్రిని, గ్రామానికో శాసనసభ్యుడిని పంపే పాలకులు ప్రజలు కష్టాల్లో ఉంటే సాయం అందించేందుకు మాత్రం ముందుకు రావడం లేదని నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోతే ప్రజలకు సాయం అందించడానికి మండలానికో మంత్రిని ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. ఇంత విపత్తు వస్తే సహాయం కోసం జిల్లాకు రెండు కోట్ల రూపాయలా ఇచ్చేది? ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఇన్ని కుటుంబాలు రోడ్డున పడితే స్థానికంగా ఉన్న నాయకులు ఏమయ్యారు? ఇంతకంటే దారుణం ఉంటుందా? అని మనోహర్ మండి పడ్డారు.
కడప జిల్లాలో భారీ వరదలు.. ఒక్కసారి కూడా సందర్శించని సీఎం
సీఎం జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల బడ్జెట్ అని పెద్దపెద్ద మాటలు చెబుతారుగానీ సొంత జిల్లాలో మాత్రం పర్యటించలేరని మనోహర్ మండిపడ్డారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుందా అని, గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయాయని, ఇళ్లు, గుళ్ళు కొట్టుకుపోయాయని, రహదారులు, చెట్లు, పశుసంపద నాశనం అయ్యిందని, పొలాలు మునిగిపోయాయని, నాలుగు రోజులుగా కనీసం వైద్య సదుపాయాలు లేవని, ఇప్పటి వరకు గ్రామాలకు కరెంటు సదుపాయం కూడా పునరుద్ధరించ లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. చిన్నపిల్లలతో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీసే పరిస్థితి కనిపిస్తోందని మనోహర్ ఆవేదన వ్యక్తం చేసారు.
Recommended Video
వర్క్ ఫ్రం హోమ్ సీఎం.. వరదలప్పుడు కూడా పర్యటించకపోతే ఎలా అంటున్న జనసేన నేత
మానవ తప్పిదం కారణంగానే ఈ విపత్తు సంభవించిందని, కేవలం ఇసుక మాఫియా స్వార్ధం కారణంగానే గ్రామాలకు గ్రామాలు మునిగిపోయాయని, ఈ విపత్తు వందకు వంద శాతం మానవ తప్పిదం మాత్రమేనని, వారి వ్యాపారాల కోసం, ఇసుకను దోచుకోవడం కోసం నీటిని ఆపేసి ఇంతటి దారుణ విలయానికి కారకులయ్యారని ధ్వజమెత్తారు. ఇసుక వ్యాపారం కోసం రాష్ట్రాన్ని అమ్మేశారని, వైసీపి నేతలు సంపాదించింది సరిపోక దోచుకోవడం కోసం ఇలాంటి పనులు చేస్తుంటే ఏంచెయ్యాలో అర్ధం కావడం లేదని దుయ్యబట్టారు. పరిపాలనా దక్షత లేని ముఖ్యమంత్రి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంటి నుంచి రెండు వీడియో కాల్స్ పెట్టుకుని అద్భుతంగా అభివృద్ధి జరుగుతోందని చెబుతూ ప్రజల దృష్టిని ఏమారుస్తున్నారని మనోహర్ ధ్వజమెత్తారు.