వీలునామా రాస్తున్నారా? ఈ చిన్న తప్పులు చేస్తే ఆస్తి పోతుంది జాగ్రత్త!
మనం కష్టపడి సంపాదించిన ఆస్తి, మన తర్వాత మన పిల్లలకు లేదా నచ్చిన వారికి దక్కాలనే ఉద్దేశంతో చాలామంది 'వీలునామా' (Will) రాస్తుంటారు. జీవితాంతం కష్టపడి కూడబెట్టిన సొమ్ము విషయంలో భవిష్యత్తులో గొడవలు రాకూడదనే ఈ పత్రం రాస్తారు. అయితే, వీలునామా రాసినంత మాత్రాన అది అంతిమ తీర్పు కాదు. మన దేశంలో ఎన్నో వీలునామాలు కోర్టు మెట్లు ఎక్కుతుంటాయి. లీగల్ వారసులు లేదా ఆస్తిలో వాటా ఉన్న ఏ వ్యక్తి అయినా దీనిపై సందేహాలు వస్తే కోర్టులో సవాలు చేయవచ్చు. అసలు ఒక వీలునామాను కోర్టులో ఎప్పుడు సవాలు చేయవచ్చు? అది చెల్లకుండా పోవడానికి ఉండే లీగల్ లూప్హోల్స్ ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం.
ఒక వీలునామా చట్టబద్ధంగా చెల్లాలన్నా, భవిష్యత్తులో ఎవరూ కోర్టుకు లాగకుండా ఉండాలన్నా కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ వీలునామా రాసే సమయంలో సదరు వ్యక్తికి మానసిక సామర్థ్యం సరిగా లేదని నిరూపించినా, లేదా ఎవరిదైనా ఒత్తిడి, బెదిరింపులకు లోనై రాశారని తెలిసినా అది కోర్టులో వీగిపోతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఫోర్జరీ సంతకాలు చేయడం, తప్పుడు పత్రాలు సృష్టించడం వంటి మోసాలు జరిగితే కోర్టు ఆ వీలునామాను పూర్తిగా రద్దు చేస్తుంది.

సాక్షుల సంతకాలు లేకపోతే అంతే సంగతులు!
చాలామంది వీలునామా రాసేటప్పుడు చేసే అతిపెద్ద తప్పు.. సాక్షుల విషయంలో నిర్లక్ష్యం వహించడం. చట్టం ప్రకారం వీలునామా రాసే కర్త (టెస్టేటర్) తన స్వహస్తాలతో, పూర్తి స్పృహతో సంతకం చేయాలి. దానితో పాటు, ఆయన ఆ పత్రంపై స్వచ్ఛందంగానే సంతకం చేశాడని ధృవీకరించే కనీసం ఇద్దరు సాక్షుల సంతకాలు తప్పనిసరి. సరైన సాక్షులు లేకపోయినా, వారి వివరాలు సరిగా లేకపోయినా ఆ డాక్యుమెంట్ లీగల్గా చెల్లకుండా పోతుంది. అందుకే వీలునామా రాసేటప్పుడు స్పష్టమైన భాష, పక్కా లీగల్ డాక్యుమెంటేషన్ ఉండాలి. కాగా, వీలునామాను రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి కాకపోయినా.. రిజిస్టర్ చేసుకుంటే దానికి చట్టబద్ధత అదనంగా పెరుగుతుంది. ఫలితంగా భవిష్యత్తులో ఎవరైనా కోర్టులో సవాలు చేయాలనుకున్నా అది చాలా కష్టమవుతుంది.
ప్రొబేట్ తర్వాత సవాలు చేయడం కష్టమేనా?
సాధారణంగా వీలునామాను కోర్టులో సవాలు చేయడానికి నిర్దిష్ట కాలపరిమితి అంటూ ఏమీ లేదు. కానీ, కోర్టు ద్వారా వీలునామాకు ప్రామాణికత కల్పించే 'ప్రొబేట్' (Probate) ప్రక్రియ జరుగుతున్నప్పుడే ఏవైనా అభ్యంతరాలు ఉంటే లేవనెత్తడం మంచిది. ఒకసారి ప్రొబేట్ పూర్తయిన తర్వాత కూడా వీలునామాను సవాలు చేయవచ్చు, కానీ ఆ సమయంలో న్యాయ ప్రక్రియ మరింత క్లిష్టంగా మారుతుంది. అనవసర ఆలస్యం కేసును సంక్లిష్టం చేస్తుంది కాబట్టి, సవాలు చేయాలనుకునే వారు సరైన సమయంలో కోర్టును ఆశ్రయించాలి. కోర్టులో కేసు వేసినప్పుడు, సదరు వీలునామా తప్పు అని నిరూపించాల్సిన పూర్తి బాధ్యత (Burden of Proof) సవాలు చేసే వ్యక్తిపైనే ఉంటుంది. అందుకే ఆస్తి పంపకాల విషయంలో గొడవలు రాకూడదంటే చట్టపరమైన నిబంధనలు తూచా తప్పకుండా పాటించడం ఉత్తమం.














Click it and Unblock the Notifications