ఇంత దివాళాకోరుతనమా?: ఏపీ సర్కారువి తప్పుడు లెక్కలంటూ నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఏపీలో వేతనాలు, పెన్షన్లపై చీఫ్ సెక్రెటరీ లెక్కలు ఉద్యోగుల్నీ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. 111 శాతం ఖర్చు చేస్తున్నట్టు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా సర్కారు లెక్కలు: నాదెండ్ల మనోహర్
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు, పించన్లపై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతున్న లెక్కలు నమ్మశక్యంగా లేవని అన్నారు. ఉద్యోగులతో పాటు యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేలా అంకెల గారడీ చేశారని, రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎందుకు ఈ విషయం ప్రస్తావించలేదన్నారు. అసెంబ్లీలో లెక్కలు పక్కాగా చెప్పాల్సి ఉంటుందని, ఈ తప్పుడు లెక్కల నివేదికను ఎవర్ని మోసపుచ్చడానికి తయారు చేయించారని నాదెండ్ల మనోహర్ నిలదీశారు. ఏపీపీఎస్సీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీచేశారో చెప్పాలని అన్నారు నాదెండ్ల మనోహర్. నెలకు ఉద్యోగుల జీతాలకు, పెన్షన్ల కోసం రూ. 4600 కోట్లు ఖర్చు అవుతున్నాయని ఉద్యోగ సంఘాలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాయని, ఈ విషయం నిజం కాకపోతే చీఫ్ సెక్రటరీ, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎందుకు ఖండించలేదని, యేటా 67 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
ఉద్యోగులు రిటైరవుతుంటే.. భారం పెరుగుతోందా?: నాదెండ్ల
ప్రభుత్వం వచ్చిన తరువాత నియమించిన వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జీతాలను కేంద్రం ఇచ్చే నిధుల నుంచే మళ్లిస్తున్నారని, ఏ దశలో రాష్ట్రప్రభుత్వం ఖజానాకు భారం పడుతుందో పారదర్శకంగా చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ప్రతీ ఏటా ప్రభుత్వ ఉద్యోగం నుంచి సుమారు 15 వేల మంది రిటైర్ అవుతున్నారని, ఆ మేరకు భర్తీ జరగడంలేదని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదని, మరి ఏ విధంగా వ్యయం పెరిగిందో వెల్లడించాలని జనసేన నేత నాదెండ్ల ప్రశ్నించారు.
ఏపీ సర్కారు లెక్కలు అంకెల గారడే: నాదెండ్ల
ఏపీ సీఎం జగన్ కు సమర్పించిన పీఆర్సీ నివేదికలో సీఎస్ సమీర్ శర్మ వివరించిన అంశాలపై ఈ మేరకు నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లపై సీఎస్ చెబుతున్న గణాంకాలు నమ్మశక్యంగా లేవన్నారు. ఉద్యోగులను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా అంకెల గారడీ చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 111 శాతం మేర జీతాలు, పెన్షన్ల చెల్లింపుకే వెళ్లిపోతుందంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు.
ఏపీ సర్కారు దివాళాకోరుతనమే: నాదెండ్ల మనోహర్ ఫైర్
2018లో పీఆర్సీ ప్రకటించారు... కానీ 2019 నుంచి 2021 వరకు ఉద్యోగులు భారీ సంఖ్యలో రిటైరయ్యారు. వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైరన తర్వాత కూడా వేల కోట్ల భారం ఎలా పడుతుందో ప్రభుత్వం వివరించాలి. ఉద్యోగుల వేతనాల అంశంలోనే ఈ స్థాయిలో అంకెల గారడీ చేస్తున్న యంత్రాంగం... రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో ఇంకెన్ని తప్పుడు లెక్కలు వేస్తోందో అనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రానికి వస్తున్న రాబడి కంటే జీతాలకే అధిక చెల్లింపులు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం కంటే ఎక్కువగా జీతాలకు ఇస్తున్నామని చెప్పడం ఆర్థికశాఖ దివాళాకోరుతనాన్ని వెల్లడిస్తుందని, ఈ తప్పుడు లెక్కలపై ప్రతి ఉద్యోగి ప్రశ్నించాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.