బెంగళూరులో ఉంటే అనంతలో కేసు ఎలా పెడతారు?: డీజీపీకి జనసేన
అమరావతి: అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చిలకం మధుసూదనరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను కోరారు. ప్రస్తుతం తమ పార్టీకి సంబంధించిన లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయి సభ్యులుగా ఉన్నారని తెలిపారు.
అయితే, చిలంకపై ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని, ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెప్టెంబర్ 30న కేసు దాఖలైందని వివరించారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన అక్రమ కేసుగా భావిస్తున్నామని చెప్పారు.

సెప్టెంబర్ 30న ధర్మవరం పట్టణంలో మున్సిపల్ సిబ్బంది విధులకు మధుసూదన్ రెడ్డి ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారని తెలిపారు నాదెండ్ల. అయితే, వాస్తవానికి మధుసూదన్ రెడ్డి ఆ సమయంలో పట్టణంలోనే లేరని, బెంగళూరులో ఉన్నట్లు తగిన ఆధారాలను కూడా ఆయన చూపిస్తున్నారని నాదెండ్ల పేర్కొన్నారు.
పొరుగు రాష్ట్ర రాజధానిలో ఉన్న వ్యక్తి ఏ విధంగా మున్సిపల్ సిబ్బందికి ఆటంకం కలిగిస్తారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని, రాజకీయ కక్షలతో కేసులు నమోదు చేయవద్దని నాదెండ్ల డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ కేసు నుంచి మధుసూదన్ రెడ్డికి విముక్తి కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
పవన్పై పార్థసారథి తీవ్ర విమర్శలు
ఇది ఇలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆ పార్టీని వీడిన పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. జనసేన పార్టీ కీలక నేత రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చింతల పార్థసారథి జనసేన పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీలో కీలక పాత్ర పోషించి, అనకాపల్లి ఎంపీ స్థానం నుండి పోటీ చేసి ఓటమిపాలైన చింతల పార్ధసారధి జనసేన పార్టీకి రాజీనామా చేశారు.
జనసేన పార్టీని స్థాపించి ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ పార్టీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలోపేతంగా లేదు. బలమైన కేడర్ పార్టీకి లేదు. అంతేకాదు బలమైన నాయకత్వం కూడా పార్టీలో కనిపించటం లేదు. ఇప్పటికీ సంస్ధాగత లోపాలతో నెట్టుకొస్తోంది జనసేన పార్టీ. 2019 ఎన్నికల్లో సత్తా చాటుతుంది అని భావిస్తే ఒకే ఒక స్థానానికి పరిమితమైందని చింతల ధ్వజమెత్తారు.
స్వయంగా పార్టీ అధినేత పవన్ పోటీ చేసిన రెండుస్ధానాల్లోనూ ఓటమి పాలు కావడం జనసేన పార్టీ పరిస్థితిని ప్రశ్నార్థకం చేసింది. ఇక ఓటమి బాధ నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా పార్టీని బలోపేతం చేస్తారని భావిస్తే ప్రస్తుతం కూడా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం జరగడం లేదు. ఆ దిశగా పవన్ కళ్యాణ్ చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఒక్కొక్క కీలకనేత పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలలో చేరుతున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications