మాకు సలహాలు ఇచ్చేవారు ఎక్కువయ్యారు; పొత్తులపైనా నాగబాబు సంచలన వ్యాఖ్యలు
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం హరిపురం లో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకోవాలి అనేది పూర్తిగాఆయన ఇష్టమని,ఆయనకు ఎవరూ ఎదురు చెప్పడానికి వీలు లేదని నాగబాబు వ్యాఖ్యానించారు.
అంతేకాదు ఓ వర్గం మీడియా ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన ఆయన తమకు సలహాలిచ్చే వారు ఎక్కువ అయ్యారని, ఎవరూ తమకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చురకలంటించారు. కొన్ని మీడియా సంస్థలు తమకు సలహాలు ఇస్తున్నాయని,వారి వారి పార్టీలకు సలహాలు ఇచ్చుకుంటే మంచిదని నాగబాబు పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో 2024 ఎన్నికల ను ఉద్దేశించి మాట్లాడిన నాగబాబు టిడిపి, జనసేన పార్టీల పొత్తులపై చర్చలు వద్దన్నారు.

జనసేన తరపున ఎవరూ బరిలోకి దిగినా వారిని గెలిపించడమే ధ్యేయంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజలలో చైతన్యం మొదలైందని పేర్కొన్న నాగబాబు గత ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు వచ్చాయని, ఇప్పుడు ఓటింగ్ శాతం 35 శాతానికి పెరుగుతుందని అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటికి పోవాలని ఆయన ఆకాంక్షించారు.
రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు కోసం జనసేన అధికారంలోకి రావాలని నాగబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు తాము ఎవరి సలహాలు తీసుకోలేదని, ఇప్పుడు సలహాలిచ్చే వాళ్ళు ఎక్కువయ్యారు అని, అంత అవసరం తమకు లేదని నాగబాబు స్పష్టం చేశారు. వైసీపీ పాలన పై నిప్పులు చెరిగిన నాగబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారని లక్షల కోట్ల డబ్బులు వైసిపి నాయకులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు.

ప్రజలకు మంచి చేయడానికి డబ్బులు ఎందుకు లేవో చెప్పాలని జగన్ సర్కారు నాగబాబు నిలదీశారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే అన్ని పంటలకు గిట్టుబాటు ధరలను ఇచ్చేలా చూస్తారని నాగబాబు తెలిపారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పడంతోపాటు, వచ్చే ఎన్నికల్లో మహిళల ప్రాధాన్యత చాలా ఉందని, జనసేన పార్టీకి మహిళలు ఆక్సిజన్ లాంటి వారని నాగబాబు వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications