మేం బిజీ, టిడిపిలోకి పవన్కల్యాణ్ అవాస్తవం: నాగబాబు
హైదరాబాద్: మెగా సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనే ప్రచారం పైన నటుడు, నిర్మాత నాగబాబు స్పందించారు. ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. తాను, తన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టిడిపిలో చేరుతున్నారనే వార్తలను ఆయన తోసిపుచ్చారు.
మీడియా కథనాలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. టిడిపిలో చేరుతున్నట్లుగా వచ్చిన వార్తలను కొట్టి పారేసిన నాగబాబు తాము రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నామన్నది కూడా అవాస్తవమన్నారు. ప్రస్తుతం తాము తమ వృత్తిలో బిజీగా ఉన్నామని చెప్పారు. టిడిపిలో చేరుతున్నారనే ప్రచారంతో పాటు కొత్త పార్టీ వార్తలు మీడియాలో వస్తున్నాయని, అదంతా అవాస్తవమే అన్నారు. మీడియా కథనాలతో ప్రజలు, అభిమానుల్లో గందరగోళం ఏర్పడిందన్నారు. తమను సంప్రదించకుండా, తమ వివరణ కోరకుండా ప్రసారం చేయడం సరికాదన్నారు.

కాగా, వవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరుతారంటూ గత కొద్ది నెలలుగా ప్రచారం సాగుతోంది. అయితే, మూడు నాలుగు రోజులుగా ఈ ప్రచారం ఊపందుకుంది. పవన్ టిడిపిలో చేరడంతో పాటు నాగబాబు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.
ఈ ప్రచారంపై తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం స్పందించారు. పవన్ మంచివాడని, తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. టిడిపి నేతలు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోడెల శివ ప్రసాద్ తదితరులు స్పందించారు.












Click it and Unblock the Notifications