జనసేనతో చిరంజీవి- నాగబాబు క్లారిటీ : ఏపీలో పొత్తుల పైనా - నెక్స్ట్ స్టెప్..!!
చిరంజీవి తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలని భావిస్తున్నారా. జనసేనకు ఆయన మద్దతు ఏ విధంగా ఉంటుంది. కొంత కాలంగా ఈ ప్రశ్నల పైన మెగా ఫ్యాన్స్ తో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కర చర్చ సాగుతోంది. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు జనసేన కోసం క్షేత్ర స్థాయి పర్యటనలు ప్రారంభించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఆయన జనసేన కేడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ జనసేనకు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు నాగబాబు అన్నయ్య చిరంజీవి పొలిటికల్ ఫ్యూచర్ గురించి చెప్పుకొచ్చారు.
జనసేనకు చిరంజీవి మద్దతు
చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదని నాగబాబు తేల్చి చెప్పారు. చిరంజీవి కి సినిమాలంటే ప్యాషన్ అని చెబుతూనే...అన్నయ్య మద్దతు మాత్రం జనసేనకు ఉంటుందని స్పష్టం చేసారు. పొత్తుల విషయంలో పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని గతంలోని ప్రభుత్వం..ప్రస్తుత ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయంటూ నాగబాబు ఆరోపించారు. విశాఖలోని రుషికొండకు గుండు కొట్టటమే ఇందుకు నిదర్శమని చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 9 నియోజకవర్గాలకు చెందిన జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
పార్టీ ముఖ్యులతో పవన్ సమావేశం
జనసేన లో కొన్ని ప్రాంతాల్లో నాయకత్వం లోపాలు ఉన్నాయని అంగీకరించారు. పార్టీలో అక్కడక్కడా విభేదాలున్నా..కార్యకర్తలు బలమైన మద్దతు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విలువైన ఖనిజ సంపద ఉందని.. వనరులు ఉన్నాయని, అయినా స్థానిక ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన దీన పరిస్థితులు కొనసాగుతున్నాయని నాగబాబు ఆవేదన వ్యక్తం చేసారు. రేపు (శనివారం) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాయంలో పార్టీ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసారు. పార్టీ కార్యకర్తలపైన కేసులు నమోదు అంశం పైన డీజీపీని కలవాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ నేత మనోహర్ డీజీపీకి లేఖ రాసారు. అదే సమయంలో సాధ్యమైనంత వరకు జిల్లాల పర్యటనలు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
Recommended Video
నడ్డా పర్యటనతో పూర్తి క్లారిటీ
ఈ నెల 6,7 తేదీల్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా ఏపీ పర్యటన సమయం లో తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటుగా పొత్తుల అంశం పైన క్లారిటీ ఇవ్వనున్నారు. నడ్డాతో పవన్ విజయవాడలో 7వ తేదీన సమావేశం అవుతారని తెలుస్తోంది. ఆ సమయంలో రెండు పార్టీల భవిష్యత్ రాజకీయ అడుగులు పైన పూర్తి క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పిన పవన్ ..ఇప్పుడు రాజకీయంగా వేస్తున్న అడుగులను అటు టీడీపీ ఆసక్తిగా గమనిస్తోంది, పొత్తుల అంశం పైన తమ వైపు నుంచి తొందర పడి ప్రతిపాదనలు చేయకూడదని ఇప్పటికే టీడీపీ నిర్ణయించింది. దీంతో..పార్టీ సమావేశం..నడ్డా పర్యటన తరువాత ఏపీలో పొత్తులపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.