పోటాపోటీగా పర్యటనలు; ఏపీలో రంగంలోకి జనసేన.. జూన్1 నుండి నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటన; ఎందుకంటే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాజకీయ పార్టీల నాయకులు పర్యటనల బాటపట్టారు. ఇప్పటి నుండే ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గడపగడపకు మన ప్రభుత్వం, సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్రలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్తుంటే, టిడిపి నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమాలు, చంద్రబాబు పర్యటనలతో రాజకీయాలు రసవత్తరంగా మారుస్తున్నారు.
ఇక బీజేపీ అగ్ర నాయకులను రంగంలోకి దింపి ప్రచార పర్వానికి ఇప్పటి నుండే శ్రీకారం చుడుతుంటే జనసేన పార్టీ నాయకులు కూడా పర్యటనల బాట పట్టారు

నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటన .. షెడ్యూల్ ఇదే
ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర చేసి, ఆర్థిక ఇబ్బందులతో మృతిచెందిన కౌలు రైతుల కుటుంబాలకు బాసటగా నిలిచారు. ఇక తాజాగా జూన్ 1వ తేదీ నుండి జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ షెడ్యూల్ ను విడుదల చేసింది. జూన్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా, జూన్ 2వ తేదీన విజయనగరం జిల్లా, జూన్ 3వ తేదీన విశాఖ జిల్లాలోని పలు నియోజకవర్గాలలో నాగబాబు పర్యటిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది.

పార్టీని బలోపేతం చెయ్యటంపై జనసేనాని దృష్టి
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారించిన జనసేన పార్టీ ఈ క్రమంలోనే నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నాగబాబు జనసేన పార్టీ ముఖ్య నాయకులకు, జిల్లా కమిటీ నాయకులకు, నియోజకవర్గ కమిటీ నాయకులకు, ఆయా విభాగాల కమిటీ నాయకులకు, వీర మహిళలకు, అందుబాటులో ఉంటారని జనసేన అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ వెల్లడించారు. ఈ పర్యటన ద్వారా నాగబాబు పార్టీ శ్రేణులకు ముఖ్యమైన సమావేశాలు నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని ఆయన తెలిపారు.

జనసేన పార్టీలోకి చేరికలు.. నాగబాబు కీలక నిర్ణయాలకు ఛాన్స్
పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపి వారిని ప్రజల్లోకి వెళ్ళేలా ఈ పర్యటన సాగిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో పార్టీని బలోపేతం చేయడానికి పలు కీలక నిర్ణయాలను కూడా నాగబాబు తీసుకుంటారని హరి ప్రసాద్ తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు, విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్న వారిని నాగబాబు పార్టీలోకి ఆహ్వానిస్తారని, చేరికలు ఉంటాయని వెల్లడించారు. జనసేన పార్టీని బలోపేతం చేయడంపై పవన్ కళ్యాణ్ సూచనల మేరకు, నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటన కొనసాగుతుందని ఆయన తెలిపారు.

ఏపీలో దూకుడు చూపిస్తున్న జనసేన
గత ఎన్నికల కంటే భిన్నంగా ఈసారి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై జనసేన పార్టీ దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే జనసేన పార్టీ పరిమితం అయ్యింది. అయితే ఈసారి అలా కాకుండా రాజకీయంగా బలంగా ప్రజల్లోకి వెళ్ళటానికి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అలాగే ఈ సారి వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా పొత్తులతో ఎన్నికలకు వెళ్తామని చెప్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో జనసేన భవిష్యత్ ఎన్నికలకు దూకుడుగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications