నాగరాజుపై కాల్పులు: నలుగురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్: నగరంలో జ్యోతిష్యుడు నాగరాజుపై జరిగిన కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. జ్యోతిష్యుడు నాగరాజుపై జరిపిన కాల్పుల కేసులో పోలీసులు నలుగురు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎల్బీనగర్ డిసిపి వివరాలను మీడియాకు తెలిపారు.
నాగరాజు హత్య కోసం ఢిల్లీకి చెందిన చాంద్, సోహల్లకు సుపారీ ఇచ్చిన ప్రత్యర్థులు భూతం శ్రీనివాస్, చిన్న శ్రీనివాస్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నందింగామ కాల్పుల ప్రతీకారంగానే సరూర్నగర్ కాల్పులు జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు.

సుపారీ తీసుకున్న బాబు, గణేష్లను కూడా అరెస్ట్ చేసినట్లు డిసిపి తెలిపారు. ఏలూరులో నాగరాజు అభివృద్ధిని ఓర్వలేకనే ప్రత్యర్థులు ఆయనపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోందని చెప్పారు. కాల్పుల ఘటనకు సంబంధమున్న మరో 8మంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల సరూర్నగర్ జింకలబావి సమీపంలో జ్యోతిష్యుడిపై కాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా నాగరాజుపై 5 రౌండ్ల కాల్పులు జరిపారు. పొట్టలోకి రెండు బుల్లెట్లు, తొడ భాగంలోకి ఒక బులెట్ దూసుకెళ్లింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న జ్యోతిష్యుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications