అక్రమ మైనింగ్ జరగలేదని నిరూపించే దమ్ము జగన్ సర్కార్ కు ఉందా ? నక్కా ఆనంద్ బాబు సవాల్
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిలికి చిలికి గాలివానగా మారుతోంది. దేవినేని ఉమాపై జరిగిన దాడి, ఆ పై దేవినేని ఉమాపై పెట్టిన కేసులు, అరెస్టుల పర్వంతో ఏపీ రాజకీయం వేడెక్కింది. టీడీపీ నేత దేవినేని ఉమా పై దాడి చేసి తిరిగి రివర్స్ కేసులు పెట్టారని విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు కొండపల్లి అక్రమ మైనింగ్ వ్యవహారంపై పది మంది సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని వేశారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి అక్రమ మైనింగ్ పై నిజనిర్ధారణ చేయాలని టీడీపీ అధినేత ఆదేశించారు.
ఈ క్రమంలో పోలీసులు అనుమతి లేదని టిడిపి నేతలను గృహనిర్బంధం చేశారు. దీంతో టిడిపి సీనియర్ నాయకుడు నక్క ఆనంద్ బాబు జగన్ సర్కార్ పై ధ్వజమెత్తారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరగలేదని నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రభుత్వానికి ఆ దమ్ము ఉందా అని ప్రశ్నించిన నక్కా ఆనంద్ బాబు, పోలీసుల సాయంతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు అని మండిపడ్డారు. అగ్రవర్ణాలు చట్టాన్ని అసహ్యించుకునే విధంగా ఎస్సీ, ఎస్టీల కోసం తీసుకొచ్చిన అట్రాసిటీ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని నక్కా ఆనంద్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video
తప్పుడు అట్రాసిటీ కేసులు పెట్టి, అసలు చట్టమే లేకుండా చేసే కుట్ర చేస్తున్నారని జగన్ పై విరుచుకుపడ్డారు నక్కా ఆనందబాబు. అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతున్నందుకు ఒక దళితుడిగా తాను ఎంతో ఆవేదన చెందుతున్నానని నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. తప్పకుండా కొండపల్లి వెళ్లి తీరుతామని, పోలీసులు తమను ఎన్ని రోజులు వెళ్ళకుండా ఆపగలరో చూస్తామని నక్క ఆనంద్ బాబు పేర్కొన్నారు. తప్పకుండా కొండపల్లి వెళ్లి అక్రమ మైనింగ్ గుట్టురట్టు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.