'ఆంధ్రజ్యోతి' ఎండి రాధాకృష్ణపై 'నమస్తే తెలంగాణ' చిందులు
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై నమస్తే తెలంగాణ దినపత్రిక విరుచుకుపడింది. అయితే రాసేవాడికన్నా ఉండాలి...లేకుంటే చదివేవాడికైనా ఉండాలి...బుద్ధి! అంటూ చీవాట్లు పెట్టింది. అదే ఫిట్మెంటు..అదే రాధాకృష్ణ అంటూ వ్యంగ్య బాణాలు వదిలింది. నిన్నగాక మొన్న తెలంగాణలో పీఆర్సీమీద ఏం రాతలు రాశాడు, ఇవాళ ఏపీలో ఫిట్మెంటు మీద ఏం రాస్తున్నాడు అంటూ ప్రశ్నించింది.
నమస్తే తెలంగాణ వార్తాకథనం రాధాకృష్ణపై దుమ్మెత్తిపోస్తూ ఇలా సాగింది - తెలంగాణ విషయంలో 2013 జూలైనుంచే వేతనాలు పెరగాలన్నాడు. పాపం ఉద్యోగులు 11 నెలలు, ఆరు వేల కోట్లు నష్టపోయారన్నాడు. నిజానికి తెలంగాణ ఆవిర్భావంనుంచి మాత్రమే ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదు. అయినా ఉద్యోగులు అంగీకరించడానికి అనేక కారణాలున్నాయి అంటూ లేనిపోని విషబీజాలు నాటేందుకు కూడా యత్నించాడు.
ఆ వార్తాకథనం ఇంకా ఇలా సాగింది - మరి ఇవాళ ఏపీ కూడా రాష్ట్ర ఆవిర్భావంనుంచే పెంచింది. మరి నిన్న తాను రాసిన 2013 జూలై ఇవాళ ఎందుకు గుర్తుకురాలేదు? ఉద్యోగులు ఎంత నష్టపోయారో లెక్కలు ఎందుకు వేయలేదు? పైగా చంద్రబాబుకోసం కడివెడు కన్నీళ్లు కార్చాడు. ఆంధ్రప్రదేశ్ ఇంకా కుదురుకోలేదట. ఆర్థిక కష్టాలు... రెవెన్యూపోటు, కేంద్రంనుంచి అందని సాయం, అన్నీ గుర్తుకు వచ్చాయి. ఇవన్నీ తెలంగాణకు మాత్రం లేవా? కేంద్రం ఏ విషయంలోనైనా సహకరించిందా? రాష్ట్రంలో విద్యుత్ తగినంత లేదని తెలిసీ ఆనాడు రైతు ఆందోళనలు, రైతు ఆత్మహత్యలు అంటూ ప్రభుత్వంపై రాళ్లు వేసి రాక్షసానందం పొందలేదా?
"ఇక రాష్ట్రం ఏర్పడి ఎనిమిది నెలల తర్వాతకూడా ఏపీ కుదురుకోనట్టు, ఫిట్మెంటు ప్రకటించిన చంద్రబాబు సాహసవంతుడైనట్టు కనిపిస్తున్నది ఆయనకు. కొసమెరుపు ఏమిటంటే ఎపుడో ప్రకటించిన రిటైర్మెంట్ పెంపునకు ఇవాల్టి పీఆర్సీకి ముడి పెట్టి పీఆర్సీ వ్యవహారంలో మొత్తంగా తెలంగాణ కన్నా ఏపీ ఉద్యోగులకే ఎక్కువ ప్రయోజనం చేకూరిందని తేల్చేసి బాబుకు వీరతాడు వేశాడు" అంటూ నమస్తే తెలంగాణ రాధాకృష్ణ రాసిన వార్తాకథనాలను బేరీజు వేస్తూ తప్పు పట్టింది.