నమస్తే తెలంగాణ సంచలన కథనం: రెండో నిందితుడిగా చంద్రబాబు?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో నమస్తే తెలంగాణ దినపత్రిక సోమవారంనాడు సంచలన వార్తాకథనాన్ని ప్రచురించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన కేసులో రేవంత్ రెడ్డిని ఎసిబి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో చంద్రబాబును రెండో నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని ఆ పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. నమస్తే తెలంగాణకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అనుకూల పత్రిక అనే పేరున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు అటువంటి అవకాశం ఏదీ కనిపించలేదు. చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదని ఎసిబి అధికారులు సోమవారం ఉదయం చెప్పారు.

నమస్తే తెలంగాణ వార్తాకథనం ప్రకారం - ఎమ్మెల్యే కొనుగోలు బేరం వ్యవహారం ఏపీ సీఎం చంద్రబాబు మెడకు చుట్టుకునే అవకాశముంది. ఈ కేసులో కుట్రకు సూత్రధారిగా చంద్రబాబు పేరును రేవంత్రెడ్డి స్వయంగా చెప్పినందున బాబును ఏ 2గా చార్జ్షీట్లో చేర్చే అవకాశం ఉందని ఏసీబీ మాజీ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. డబ్బులు ఇచ్చే సమయంలోనూ, పట్టుబడ్డ సమయంలోనూ వాటిని ఎవరు పంపారు? సమకూర్చింది ఎవరు? కుట్రకు కారణం ఎవరన్న అంశాలపై నిశిత పరిశీలన ఉంటుందని వారు చెప్పారు.
వీటిని పోత్సహించిన వారిని కూడా నిందితుల్లో చేర్చే అధికారం ఏసీబీకి ఉందని వారు స్పష్టంచేశారు. ఎమ్మెల్యేతో బేరసారాల సమయంలో చంద్రబాబే తనను ఇక్కడికి పంపాడని రేవంత్ రెడ్డి చెప్పడం ఏసీబీ అధికారుల ట్రాప్వీడియోల్లో స్పష్టంగా రికార్డయిందని ఏసీబీ అధికారులు తెలిపారు. తమ బాస్ బాబు తనను పంపాడని నాలుగైదుసార్లు వీడియో ఫుటేజ్లో రేవంత్రెడ్డి స్పష్టం చేశాడని ఏసీబీ అధికారులు చెప్పారు. ఈ లెక్కన కుట్రకు పోత్సహించిన చంద్రబాబుపై కూడా అభియోగాలు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నదని సమాచారం.
కుట్ర పూరితమైన ఎమ్మెల్యే కొనుగోలు యత్నం వ్యవహారంలో పీసీ యాక్ట్ ప్రకారం రేవంత్రెడ్డి మీద సెక్షన్ 8,9, 13 ప్రకారం ఏసీబీ కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. ఈ ఎఫ్ఐఆర్లో బాధిత ఎమ్మెల్యే అయిన స్టీఫెన్ సన్ ఇచ్చే స్టేట్మెంట్ కీలకంగా ఉంటుంది. కొనుగోలు వ్యవహారం మొత్తం చంద్రబాబే చేయించాడని రేవంత్ చెప్పినట్టు స్టీఫెన్ సన్ వాంగ్మూలం ఇస్తే రెండో నిందితుడిగా చంద్రబాబుపై ఏసీబీ కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. పీసీ యాక్ట్ ప్రకారం చంద్రబాబుపై కేసులు నమోదు చేసి చార్జిషీట్లో కూడా చంద్రబాబుపై అభియోగాలు నమోదుచేసే అవకాశాలున్నాయని అధికారులు స్పష్టంచేశారు.
నమస్తే తెలంగాణ వార్తాకథనం ఇంకా ఇలా సాగింది - ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు సీఆర్పీసీ ప్రకారం నోటీసులు ఇవ్వవచ్చా? అన్న అంశంపై న్యాయనిపుణులతో ఏసీబీ ఉన్నతాధికారులు అర్ధరాత్రి వరకు చర్చలు జరిపినట్టు తెలిసింది. రేవంత్ వీడియో ఫుటేజ్లో స్పష్టంగా ఆధారాలుండటంతో బాబును పిలిచే అవకాశాలున్నట్టు న్యాయవాదులు చెప్తున్నారు. ఒకవేళ స్టేట్మెంట్ కోసం అవసరమైతే నోటీసులు మాత్రం ఇచ్చే అవకాశం ఉందని సీనియర్ క్రిమినల్ లాయర్స్ అభిప్రాయపడ్డారు. తప్పనిసరి పరిస్థితి అయితే సీఆర్పీసీ సెక్షన్ 109 ప్రకారం పిలవచ్చని వారు తెలిపారు. ఈ కేసులో నిందితులకు కనీసం ఐదేళ్ల పాటు శిక్షపడే అవకాశం ఉందని ఆయన స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications