ప్రధాని మోడీ, బాబు, కెసిఆర్ సహా 16మంది పేర్లు శిలాఫలకంపై.. వీరే..
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన మరికొద్దిసేపట్లో జరగనుంది. అమరావతి శంకుస్థాపన చూసేందుకు ఏపీలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా ప్రజలు, ప్రముఖులు తరలి వచ్చారు. తెలుగు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేఈ వేడుకలో ప్రతి అంశం కూడా ప్రత్యేకమే.
ఇక కార్యక్రమాన్ని భావితరాలకు గుర్తు చేసేలా ఏర్పాటు కానున్న శిలాఫలకం కూడా ప్రత్యేకమే. ఈ శిలా ఫలకం పైన మొత్తం పదహారు మంది పేర్ల ఉన్నాయి.

శిలాఫలకంపై ఉన్న పేర్లలో... ముఖ్య అతిథిగా హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోసలే పేర్లు శిలాఫలకంపై ఉన్నాయి.
వీరితో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, బండారు దత్తాత్రేయ పేర్లు కూడా ఉన్నాయి. అమరావతికి మాస్టర్ ప్లాన్ అందించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో పాటు అమరావతి నిర్మాణంలో పాలుపంచుకొంటున్న జపాన్ మంత్రి ఇసుకే టకాచీ పేర్లకూ ఈ ఫలకంపై చోటు దక్కింది.
కాగా, అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సినీ ప్రముఖులు, ప్రముఖులు తరలి వస్తున్నారు. నటుడు సుమన్, కృష్ణంరాజులు కూడా వచ్చారు. గురువారం తెల్లవారుజాము నుంచే జనం అమరావతికి బారులు తీరారు. మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications