బ్లూ ఫిల్మ్స్ చూపిస్తారా?: ‘ఎంపీ మాధవ్ వీడియో’పై నందమూరి బాలకృష్ణ
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టడం లేదు. సభ్య సమాజం తలదించుకునేలా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ఆయనపై చర్యలు తీసుకోవాలని, లోక్సభ స్పీకర్ అయినా సీరియస్గా స్పందించాలని కోరుతున్నారు.
నీలిచిత్రాలు చూపిస్తారా?: గోరంట్లపై బాలకృష్ణ
తాజాగా, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎపీ గోరంట్ల వీడియో వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. గోరంటల్ మాధవ్ సభ్య సమాజం తలదించుకునే పనిచేశారన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే.. ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రజలకు సేవ చేయకుండా, నీలి చిత్రాలు చూపించారని ఘాటుగా స్పందించారు.
గోరంట్లపై చర్యలేవంటూ జగన్ను ప్రశ్నించిన బాలకృష్ణ
అంతేగాక, ఆ ఎంపీ ఏ ముఖం పెట్టుకుని హిందూపురంలో జాతీయ జెండా ఎగురవేసేందుకు వచ్చారని ప్రశ్నించారు. ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం జగన్ ప్రజలకు చెప్పాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మోసం చేశారని వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. చేతకాని పాలనతో ప్రజలను కష్టాలపాలు చేశారనని మండిపడ్డారు. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేసిందని ధ్వజమెత్తారు. కనీసం ఎరువులు, విత్తనాలను కూడా రాయితీపై ఇవ్వడం లేదని విమర్శించారు.
హిందూపురంలో సతీమణితో బాలకృష్ణ సందడి
సత్యసాయి జిల్లా లేపాక్షిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొని ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కాగా, హిందూపురంకు వచ్చిన బాలకృష్ణకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. హిందూపురం గ్రామీణ మండలం చలివెందులలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని సతీమణి వసుంధరా దేవితో కలిసి ప్రారంభించారు. బాలకృష్ణ సతీసమేతంగా రావడంతో మహిళా కార్యకర్తలు, అభిమానులు కూడా ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారు.
సొంత నిధులతో బాలకృష్ణ సేవలు
'మీకు పూర్తిగా నయం అయ్యే వరకు మందులు అన్ని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచే పంపటం జరుగుతుందని నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలను పక్కన పడేయడం సిగ్గుచేటు.ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సదుపాయాలు పార్టీలకతీతంగా అందిస్తున్నమన్నారు బాలకృష్ణ. కాగా, పార్టీ అధికారంలో లేకపోయిన హిందూపురంలో బాలకృష్ణ తన సొంత నిధులతో ప్రజలకు అనేక సేవలు చేస్తున్నారని నేతలు అన్నారు. కోరోనా సమయంలోనూ సేవలందించారని, అన్న కాంటీన్ ద్వారా ప్రతిరోజు 600 మందికి 2 రూపాయలకే భోజనం అందిస్తున్నారని తెలిపారు.