వెంకయ్యతో బాలకృష్ణ భేటీ: ఉత్సవాలకు ఆహ్వానం, నియోజకవర్గ సమస్యలపై చర్చ
న్యూఢిల్లీ: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం ఢిల్లీలో కేంద్ర కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడిని కలిశారు. అనంతపురం జిల్లాలోని తన నియోజకవర్గమైన హిందూపురంలో త్వరలో జరగనున్న లేపాక్షి ఉత్సవాలకు రావాలని బాలకృష్ణ ఈ సందర్భంగా వెంకయ్యను కోరారు.
ఈ సందర్భంగా లేపాక్షి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేసి వెంకయ్యను ఆహ్వానించారు. లేపాక్షి ఉత్సవాలకు వచ్చే విషయమై వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అదే విధంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి లేపాక్షి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికలను అందజేశారు.
అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తన నియోజక వర్గమైన హిందూపురం సమస్యలను వెంకయ్య దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. జిల్లాలోని నీటి ఎద్దడి నివారణకు, కేంద్ర నుంచి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కోరానని ఆయన చెప్పారు.
దీనికి సానుకూలంగా స్పందించిన వెంకయ్య అమృత్పథకం కింద రానున్న ఐదేళ్లలో... హిందూపురానికి రూ.1034 కోట్లు ఇస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు. లేపాక్షి ఉత్సవాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు పాల్గొంటారని బాలకృష్ణ వెల్లడించారు.
ఈ నెల 27, 28 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేస్తోంది. లేపాక్షి ఉత్సవాల్లో రావాలని మంగళవారం సాయంత్రం తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ను బాలకృష్ణ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం రూ. 4 కోట్లు కేటాయించింది.