Balakrishna: షూలు చేతపట్టుకుని వరద ప్రాంతాల్లో బాలకృష్ణ, ఇళ్లల్లోకి వెళ్లి భరోసా
అనంతపురం: ఇటీవల కురిసన భారీ వర్షాలు శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో బీభత్సం సృష్టించాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికీ అనేక నివాసాలు వరదనీటిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
షూలు చేతపట్టుకుని వరద ప్రాంతాల్లో బాలకృష్ణ
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత ప్రజలను బాలకృష్ణ పరామర్శించారు. షూలు చేతపట్టుకుని వరదనీటిలో బాలకృష్ణ నడిచారు. వీధులు, ఇళ్లల్లోకి వెళ్లి బాధితులకు భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందలేదని ఈ సందర్భంగా బాలకృష్ణ మండిపడ్డారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. వైసీపీ సర్కారు స్పందించడం లేదని ధ్వజమెత్తారు. వరద పరిస్థితులను అప్రమత్తం చేయడంలో విఫలమైందన్నారు.
అధికార పార్టీ ప్రజాప్రతినిధులెక్కడంటూ బాలకృష్ణ
స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రజల సమస్యను తెలుసుకుని కలెక్టర్తో వరద పరిస్థితిపై సమీక్షించామని బాలకృష్ణ తెలిపారు. కొట్నూరు, శ్రీకంఠాపురం, పూలకుంట సమీపంలో వంతెనలు నిర్మించాలని ప్రభుత్వానికి నివేదించామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా వచ్చి పలకరించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ సర్కారు చేసేది అదేనంటూ బాలకృష్ణ
మొబైల్ అన్న క్యాంటీన్ ద్వారా హిందూపురంలో పేద ప్రజలకు భోజన పంపిణీ చేపడుతున్నట్లు బాలకృష్ణ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం భూకబ్జాలు, నేరాలు తప్ప అభివృద్ధి చేయడం లేదన్నారు. కరోనా విపత్కర సమయంలోనూ ప్రజలకు నిత్యావసరాలు, మందులు పంపిణీ చేసింది తామేనని చెప్పారు. సంక్షేమ పథకాల పేరుతో ఎంగిలిమెతుకులు విసిరేస్తూ.. నిత్యావసర సరుకుల ధరలను పెంచేశారని మండిపడ్డారు.
హిందూపురం ప్రశాంతతను చెడగొట్టద్దంటూ బాలకృష్ణ
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ప్రశాంతమైన హిందూపురంలో హత్యా రాజకీయాలను ప్రొత్సహించడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
వివాహ వేడుకలో బాలకృష్ణ సందడి
ఇది ఇలావుండగా, అనంతపురంలో జిల్లా అభిమాన సంఘం అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్ కుమార్తె వివాహానికి బాలకృష్ణ హాజరయ్యారు. నగర శివారులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వివాహ వేడుకకు బాలకృష్ణ రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు చేరుకున్నారు. వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ.. వారిని ఆశీర్వదించారు. బాలకృష్ణతోపాటు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, టీడీపీ నేతలు హాజరయ్యారు.