లోకేష్ కు మద్దతుగా నందమూరి కుటుంబం - జూ ఎన్టీఆర్..!?
నారా లోకేష్ ఈ నెల 27నుంచి యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. లోకేష్ రాజకీయ భవిష్యత్ కు ఈ యాత్ర కీలక మలుపుగా మారనుంది. లోకేష్ పాదయాత్ర ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలకు నిర్దేశించారు. కుప్పం నుంచి ఈ నెల 27న ప్రారంభం అయ్యే యాత్రకు పార్టీ నేతలతో పాటుగా అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు హాజరు కానున్నారు. మూడు రోజుల పాటు కుప్పంలో జరిగే యాత్రం మొత్తం 400 రోజులు..నాలుగు వేల కిలో మీటర్ల మేర కొనసాగనుంది. ఇదే సమయంలో నందమూరి కుటుంబం కూడా లోకేష్ కు మద్దతుగా యాత్రలో పొల్గొనేందుకు సిద్దమైనట్లు సమాచారం. మరి.. జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు.
లోకేష్ రాజకీయ భవిష్యత్ కు కీలక మలుపు
యువగళం పేరుతో నారా లోకేష్ యువగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు - లోకేష్ అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయంగానూ లోకేష్ కు ఈ యాత్ర కీలక మలుపుగా మారనుంది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపు వ్యూహాల్లో లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత క్రియాశీలకంగా వ్యవహరించారు. మంత్రిగా ప్రభుత్వంలోకి అడుగు పెట్టారు. పార్టీ - ప్రభుత్వంలోనూ ముఖ్యనేతగా మారారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేష్ ఓడిపోయారు. దీంతో..ఓడినే చోటే గెలవాలనే లక్ష్యంతో మంగళగిరిలో ముందు నుంచి ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ యాత్ర ద్వారా ప్రజలకు.. పార్టీ శ్రేణులతో మమేకం కావాలని లోకేష్ నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారైంది.
పార్టీ నేతలు - నందమూరి కుటుంబం
లోకేష్ పాదయాత్ర ప్రారంభానికి టీడీపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ నేతలంతా కుప్పంకు వచ్చి లోకేష్ కు మద్దతు ప్రకటించనున్నారు. అదే విధంగా లోకేష్ నియోజకవర్గాలకు వెళ్లిన సమయంలో స్థానిక నేతలు..పార్టీ శ్రేణులు పాదయాత్ర సక్సెస్ చేసే బాధ్యత తీసుకుంటున్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ పాదయాత్ర లో అనుసరించాల్సిన వ్యూహాలు.. ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని పైన ఇప్పటికే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. నాలుగు వేల కిలో మీటర్ల యాత్ర ద్వారా గతంలో జగన్ చేసిన పాదయాత్ర రికార్డును అధిగమించాలని లోకేష్ లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. వచ్చే మార్చి వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో పార్టీ నేతలతో పాటుగా నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొని మద్దతుగా నిలవనున్నారు. నందమూరి కుటుంబం నుంచి లోకేష్ కు పూర్తి మద్దతు ఇవ్వటం ద్వారా అంతా టీడీపీ గెలుపు కోసం ఒకే లక్ష్యంతో ఉన్నారనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
నందమూరి హీరోలు రాక..జూ ఎన్టీఆర్ ఏం చేస్తారు..
వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అభ్యర్ధులుగా పోటీ చేయాలని నందమూరి హీరోలు ఆశిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య హిందూపురం నుంచి మూడో సారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమయ్యారు. నందమూరి తారకరత్న తనకు అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తానని ప్రకటించారు. చైతన్య క్రిష్ణ కూడా సీటు ఆశిస్తున్నారు. ఇక, లోకేష్ పాదయాత్ర వేళ నందమూరి కుటుంబ సభ్యులుగా వీరంతా మద్దతుగా నిలుస్తారని తెలుస్తోంది. తమ అవకాశానికి అనుగుణంగా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారని సమాచారం. ఇక, కల్యాణ్ రామ్ కూడా వస్తున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా లోకేష్ పాదయాత్రలో పాల్గొనకపోయినా.. మద్దతు ప్రకటిస్తారా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. రాజకీయాలకు.. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు లోకేష్ పాదయాత్ర కు మద్దతుగా నందమూరి కుటుంబం నిలుస్తున్న వేళ..ఏం చేయబోతున్నారనేది చర్చకు కారణమవుతోంది.