ముక్కుసూటి మనిషి..నందమూరి హరికృష్ణ రాజకీయ ప్రస్థానం..!
Recommended Video

హైదరాబాద్:తండ్రి ఎన్టీ ఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో ఆయన చైతన్య రథ సారథిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే ఆ పార్టీ శ్రేణులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ రాజకీయ ప్రయాణంలోనూ తనదైన ముద్ర వేశారు.
1995 ఆగస్టు సంక్షోభం నేపథ్యంలో చంద్రబాబు తన తండ్రి ఎన్టీఆర్ నుంచి సిఎం పీఠాన్ని, పార్టీ పగ్గాలను లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తూ హరికృష్ణ అన్నా టీడీపీని స్ధాపించారు. అనంతర పరిణామాలతో తిరిగి చంద్రబాబు గూటికి చేరారు. 1996-99 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన హరికృష్ణ...1996లో చంద్రబాబు క్యాబినెట్ లోనే రవాణా మంత్రిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సేవలు అందించారు.

ఆ తరువాత టిడిపి తరుపున 2008లో రాజ్యసభకు ఎన్నికైన హరికృష్ణ రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ 2013 ఆగస్ట్ 4న రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి తన రాజీనామాను పట్టుపట్టి మరీ ఆయన ఆమోదింపచేసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న హరికృష్ణ ముక్కుసూటిగా మాట్లాడటం, పలు సందర్భాల్లో పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి.
పార్టీలో తనకు, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్కు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన సన్నిహితుల వద్దే కాదు కొన్ని సార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. టిడిపి మహానాడులో పాల్గొనడం కన్నా, తన తండ్రి ఎన్టీఆర్కు నివాళులు అర్పించడమే తనకు ముఖ్యమని గతంలో హరికృష్ణ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే రాజకీయాల్లో ఉన్నా ఆయన ఏనాడు కుహనా రాజకీయనేతగా మెలగలేదని...తనదైన ముక్కుసూటి తత్వం, నిర్మొహమాటమైన అభిప్రాయాలతో పోలిటికల్ కెరీర్ కొనసాగించారు. నందమూరి హరికృష్ణ ముక్కుసూటి మనస్తత్వం ఉన్నవారు ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేరని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తుంటారు.












Click it and Unblock the Notifications