బాబు కోసం కల్సిన నారా, నందమూరి! వేరుగా ఎన్టీఆర్
విజయవాడ/గుంటూరు: నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఏకమై వచ్చారు! తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం విభేదాలు పక్కన పెట్టి నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
నందమూరి బాలకృష్ణ, జయకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నారా రోహిత్.. తదితరులు అందరూ ఏకంగా వచ్చారు. గన్నవరం విమానాశ్రయానికి మొదట చేరుకున్న కళ్యాణ్ రాం, జూనియర్ ఎన్టీఆర్, నారా రోహిత్లు కొన్ని గంటలు నిరీక్షించారు. ఆ తర్వాత వచ్చిన బాలయ్య, ఇతర నందమూరి, నారా కుటుంబ సభ్యులతో కలిసి ఒకే బస్సులో సభాస్థలికి చేరుకున్నారు.
ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాండ్రు, ముని మనవలు, ముని మనవరాళ్లు అంతా కలసి కట్టుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కేవలం ఎన్టీఆర్ వారసుల కోసం విమానాశ్రయంలో మూడు ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఆ బస్సుల్లో అంతా ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా టిడిపి ప్రాభవాన్ని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి కుటుంబం మొత్తం ఆసక్తిగా తిలకించనుంది.
హీరో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు ప్రత్యేక కారులో ప్రమాణ స్వీకార ప్రాంతానికి వచ్చారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఈ సభావేదిక సాక్షిగా.. తామంతా ఒక్కటేనని ఈ కుటుంబ సభ్యులు చెప్పాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.