హిందూపురంలో బాలకృష్ణ అవుట్- తారక్ ఇన్: జోరుగా మంతనాలు..!!
ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న సంచలనానికి తెర తీసినట్టే కనిపిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురంలో ఆయన పర్యటించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటరాముడుతో భేటీ అయ్యారు. నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం ఇది.
పుట్టపర్తి: ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న సంచలనానికి తెర తీసినట్టే కనిపిస్తోంది. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించబోతోన్నట్లు అధికారికంగా ఇదివరకే ప్రకటించిన ఆయన- 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో దిగాలనీ భావిస్తోన్నారు. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు. కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని గతంలో సంచలన ప్రకటన కూడా చేశారు.
హిందూపురంలో..
తాజాగా ఆయన శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. తన సొంత బాబాయ్ నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గం ఇది. ఇక్కడి నుంచి బాలయ్య వరుసగా రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో నందమూరి తారకరత్న విస్తృతంగా పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలను తనవైపునకు తిప్పుకొంది.
మాజీ ఎమ్మెల్యేతో భేటీ..
తన పర్యటన సందర్భంగా తారకరత్న.. తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యుడు సీసీ వెంకట రాముడు ఇంటికి వెళ్లారు. శాలువ కప్పి సత్కరించారు. చాలాసేపు అక్కడే గడిపారు. హిందూపురం రాజకీయాలు, అక్కడి స్థితిగతుల గురించీ ఆరా తీశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలు కూడా ఈ సందర్భంగా వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. నియోజకవర్గం అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల తీరుతెన్నులు, మంచినీటి సరఫరా, స్థానిక అంశాలపైనా సుదీర్ఘంగా చర్చించారు.
ఒక్కసారి ఓడిపోని స్థానం..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ ఒక్కసారి కూడా ఓటమి చవి చూడని నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. 1983 నుంచీ ఆ పార్టీ అభ్యర్థులే ఇక్కడ వరుస విజయాలను అందుకుంటూ వస్తోన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆయన కుటుంబానికి చెక్కు చెదరని ఓటు బ్యాంకు ఉంది ఈ నియోజకవర్గం పరిధిలో. ఇక్కడ జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీడీపీ రాజకీయ ప్రత్యర్థులు నామమాత్రంగా పోటీ ఇస్తూ వస్తోన్నారంతే.
1999లో గెలిచిన సీసీ
సీసీ వెంకటరాముడు 1999 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ.. 2004లో ఆయనకు టికెట్ దక్కలేదు. వెంకటరాముడు స్థానంలో పామిశెట్టి రంగనాయకులును బరిలోకి దించింది టీడీపీ. అప్పటి ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఘన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు పామిశెట్టి టీడీపీలో లేరు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన తన కుమారులతో సహా వైసీపీలో చేరారు.
టికెట్ దక్కకపోవడంతో..
2004లో తనకు టికెట్ దక్కకపోవడంతో వెంకటరాముడు పార్టీకి దూరంగా ఉంటూ వస్తోన్నారు. పెద్దగా క్రియాశీలకంగా వ్యవహరించట్లేదు. అయినప్పటికీ- నియోజకవర్గంపై ఆయనకు గట్టి పట్టు ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని- తాజాగా తారకరత్న ఆయనను కలుసుకున్నారు. టీడీపీ నియోజకవర్గ నాయకులు, బాలకృష్ణ అభిమాన సంఘాల ప్రతినిధులను కూడా కలుసుకున్నారు.
హిందూపురం నుంచి పోటీ..
ఈ పరిణామాలు కొత్త సమీకరణాలకు తెర తీసినట్టయింది. వచ్చే ఎన్నికల్లో తారకరత్న హిందూపురం నుంచి పోటీ చేయొచ్చనే ఊహాగానాలు చెలరేగాయి. ఏ కారణం లేకుండా నందమూరి కుటుంబానికి చెందిన ప్రముఖుడు పర్యటనకు రావడం జిల్లా రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. నందమూరి కుటుంబానికి ఎంతగానో ఆరాధించే హిందూపురం నియోజకవర్గం నుంచి తారకరత్న పోటీ చేయడం ఖాయమైందని చెబుతున్నారు.