ఎన్నికల బరిలోకి జూనియర్ ఎన్టీఆర్ - నందమూరి హీరో ప్రకటన..!!
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అడుగుల పై నందమూరి హీరోల కీలక అంశాలను వెల్లడించారు. కొంత కాలంగా జూ ఎన్టీఆర్ టీడీపీతో దూరంగా ఉంటున్నారు. టీడీపీ ముఖ్య నేతలు జూనియర్ ను దూరం పెట్టారు. కొద్ది కాలం క్రితం ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల్లో జూనియర్ చర్చకు కారణమయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జూనియర్ భేటీ ద్వారా బీజేపీకి దగ్గర అవుతున్నారనే ప్రచారం సాగింది. తారక్ ఇక పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారని..రాజకీయంగా ముందుకు వచ్చే లేదని అందరూ భావిస్తున్నారు. ఈ సమయంలో నందమూరి హీరో తారక రత్న కీలక ప్రకటన చేసారు.
టీడీపీ - జూ ఎన్టీఆర్ మధ్య గ్యాప్
వచ్చే ఎన్నికలు టీడీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. ఎలాగైనా గెలవాలనేది పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇందు కోసం పొత్తుల దిశగానూ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, కొద్ది నెలల క్రితం ఏపీ అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సతీమణి గురించి వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ చంద్రబాబు సభను బహిష్కరించారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో నందమూరి కుటుంబం మొత్తం వైసీపీకి హెచ్చరిక చేసింది. జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో సందేశం ద్వారా ఈ ఘటనను ఖండించారు. ఇక, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో టీడీపీ ఆందోళనకు దిగింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేసారు. అందులో ఎన్టీఆర్ - వైఎస్సార్ ఇద్దరూ ప్రజాదరణ ఉన్న నేతలేనని..ఒకరి పేరు తీయటం ద్వారా మరొకరి ఖ్యాతి పెరగదని పోస్టు చేసారు. ఇవన్నీ వైసీపీకి ఘాటు హెచ్చరికలుగా లేవంటూ కొందరు టీడీపీ నేతలు జూనియర్ పైన విమర్శలు చేసారు. ఇక..అమరావతి రైతుల యాత్రలోనూ కొందరు జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యంగా వ్యాఖ్యలు చేసారు. వీటిని తారక్ ఫ్యాన్స్ తిప్పి కొట్టారు. ఈ పరిణామాల నడుమ టీడీపీ - తారక్ మధ్య గ్యాప్ కొనసాగుతోంది.
టీడీపీ కోసం పోటీ - ప్రచారానికి తారక్
వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని నందమూరి హీరో తారకరత్న ప్రకటించారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు టీడీపీకి సేవలు అందించేందుకు నందమూరి కుటుంబం సిద్దం గా ఉంటుందని స్పష్టం చేసారు. జూనియర్ ఎప్పుడు ప్రచారంలోకి వస్తారో చెప్పలేనని..రావటం అయితే ఖాయమని వెల్లడించారు. సమయం వచ్చినప్పుడు తమ్ముడు ప్రచారానికి వస్తారని స్పష్టం చేసారు. అవసరమైన సమయంలో వస్తారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను ఏపీ నుంచి పోటీ చేస్తున్నట్లు తారకరత్న ప్రకటించారు. ప్రజల కోసం నందమూరి కుటుంబం పని చేస్తుందన్నారు. టీడీపీ తమదేనని.. తాము పార్టీలో పదవుల కోసం పాకులాడమని తారకరత్న స్పష్టం చేసారు. గుంటూరు జిల్లాలో పాలపర్రులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో తారకరత్న పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ప్రకటన అటు టీడీపీతో పాటుగా రాజకీయంగా సంచనంగా మారింది.
గుడివాడ నుంచి నందమూరి హీరో
వచ్చే ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నాని..గన్నవరం నుంచి వల్లభనేని వంశీని టీడీపీ టార్గెట్ చేసింది. ఇప్పటికే గుడివాడలో ఎవరిని బరిలోకి దింపాలనే దాని పైన తర్జన భర్జన పడుతోంది. ఇందులో భాగంగా నందమూరి హీరో నందమూరి చైతన్య కృష్ణ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గతంలో కొడాలి నాని..వంశీ పైన నందమూరి చైతన్య కృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదే విధంగా ఇప్పుడు తారకరత్న కూడా తాను ఎన్నికల బరిలో దిగనున్నట్లు స్వయంగా వెల్లడించారు. దీంతో, ఇప్పటికే బాలయ్య హిందూపురం నుంచి.. నారా లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేయటం ఖాయమైంది. ఈ సమయంలో తాజాగా నందమూరి హీరోలు ఎన్నికల బరిలో దిగటానికి సిద్దం అవుతున్నారు. ఇక...జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేస్తారంటూ తారకరత్న చేసిన ప్రకటన ఎంత వరకు ఆచరణ రూపంలో నిజం అవుతుంది..ఇది జూనియర్ ఎన్టీఆర్ తో చర్చించి చెప్పిన అంశమా..లేక.. తారకరత్న అభిప్రాయామా అనేది స్పష్టత రావాల్సి ఉంది.