నంద్యాల ఎందుకు 'కీ'లకం, ఏపీలో పెను మార్పులు: వీరందరికీ సవాల్
నంద్యాల ఉప ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఈ ఉప ఎన్నిక అనంతరం ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఈ ఉప ఎన్నిక అనంతరం ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
2019 ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఉప ఎన్నిక ఫలితం ఆధారంగా నేతలు పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
అందుకే సీఎం చంద్రబాబు, వైసిపి అధినేత జగన్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అంతేకాదు, ఓ విధంగా మంత్రి నారా లోకేష్కు, వైసిపి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు కూడా ఈ ఎన్నికలు పరీక్షే అని చెబుతున్నారు.

అఖిలప్రియకు సవాల్
నంద్యాల ఉప ఎన్నిక మంత్రి అఖిలప్రియకు ఓ సవాల్. ఏ పార్టీ అనే విషయాన్ని పక్కన పెడితే.. వ్యక్తిగతంగా నంద్యాలలో భూమా కుటుంబానికి ఉన్న పట్టు నిరూపించుకోవాలంటే తన సోదరుడు బ్రహ్మానంద రెడ్డిని కచ్చితంగా గెలిపించుకోవాలి. భూమా నాగిరెడ్డి మృతి తర్వాత కూడా నంద్యాలలో తమకు పట్టు ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా భూమా కుటుంబాన్ని నమ్ముకున్న వారిలో, తమ వర్గంలో విశ్వాసాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత అఖిలప్రియకు ఏర్పడింది. ఓసారి గెలిపించిన తర్వాత నియోజకవర్గాన్ని బ్రహ్మానంద రెడ్డి చేతిలో పెడితే సరిపోతుంది.

శిల్పా రాజకీయ భవిష్యత్తు
ఈ ఉప ఎన్నిక శిల్పా మోహన్ రెడ్డికి చాలా కీలకమని భావిస్తున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా దీనిపై ఆధారపడి ఉందనే వాదనలు కొట్టి పారేయలేమని అంటున్నారు. గెలిస్తే 2019లోను ఆయనకు సీటు ఖాయం. ఆయన చేరికకు ముందు వైసిపిలో కీలక పాత్ర పోషించిన వారు ఆయనను వెనక్కి నెట్టే అవకాశాలు లేకపోలేదంటున్నారు. శిల్పాకు అనుకూలంగా లేదని భావించి.. జగన్ కూడా పక్కన పెట్టిన ఆశ్చర్యం లేదని అంటున్నారు. కాబట్టి శిల్పాకు ఈ ఎన్నిక ఎంతో కీలకమని చెబుతున్నారు.

జగన్కు ఇదే ఛాన్స్
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని జగన్ మూడేళ్లుగా చెబుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ పార్టీ గెలుస్తుందనీ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుపై నిజంగానే ప్రజలకు ఆగ్రహం ఉందని చెప్పాలంటే నంద్యాలలో వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గెలవాలి. పార్టీ మారిన వారిపై కూడా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వైసిపి చెబుతోంది. సానుభూతి పవనాలు పక్కన పెట్టి.. వైసిపి చెబుతున్న అంశాలు వాస్తవమని తేలాలంటే భారీ మెజార్టీ కాకపోయినా, శిల్పా గెలవాలని అంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో 'స్థానికత'తో పాటు రాష్ట్ర ప్రజల ఆకాంక్షను ఎంతో కొంత వెల్లడిస్తాయంటున్నారు. దీంతో చంద్రబాబు పాలనపై ప్రజలకు ఉన్న అభిప్రాయం వెల్లడవుతుంది.

జగన్కు రెడ్డి సామాజిక వర్గం అండ ఉందా లేదా తేలుతుంది!
నంద్యాలు ఉప ఎన్నిక ద్వారా జగన్ వెంట రెడ్డి కమ్యూనిటీ ఉందా, లేదా? ఉంటే ఏ మేరకు ఉందనే విషయం చూచాయగా తెలుస్తుందని భావిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష అభ్యర్థులు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం వారే. వ్యక్తిగతంగా వారికి ఎంత పట్టు ఉందని తెలియడంతో పాటు టిడిపి, వైసిపిలకు ఏ మేరకు వారు మద్దతిస్తున్నారనేది కూడా తెలిసిపోతుందంటున్నారు.

ప్రశాంత్ కిషోర్, లోకేష్లకు పరీక్ష
నంద్యాల ఉప ఎన్నిక ఇటు మంత్రి నారా లోకేష్కు, అటు వైసిపి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్లకు కూడా పరీక్షే అంటున్నారు. టిడిపి భావి అధినేతగా అందరూ భావించే లోకేష్ ఇటీవలే మంత్రి అయ్యారు. ప్రస్తుతం చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు. కాబట్టి ఆయనకు ఈ ఎన్నికలు కీలకం. మిషన్ 2019 పేరుతో వైసిపికి పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ సత్తా కూడా తేలుతుందని అంటున్నారు. నంద్యాల గెలుపు బాధ్యత ఈయన పైన కూడా ఉంది. ఓ వైపు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సర్వే చేస్తూనే.. నంద్యాలపై ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది. విడతలవారీగా మద్య నిషేధం సూచన ప్రశాంత్ కిషోర్దే అని చెబుతున్నారు.

పాదయాత్రకు టానిక్
అక్టోబర్ 27వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ సమయంలో ఆళ్లగడ్డలో వైసిపి గెలిస్తే అది ఆయనకు టానిక్. లేదంటే పాదయాత్రపై ఎంతో కొంత ప్రభావం పడటంతో పాటు, వైసిపిలో నిరుత్సాకం చోటు చేసుకుంటుంది. అదే సమయంలో టిడిపి ఓడితే వారికి మరింత నిరుత్సాహమనే చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications