పదిన్నరకే ఉపఎన్నిక ఫలితం!: నంద్యాల ఎఫెక్ట్.. అందరి భయం అదే
నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. సోమవారం నిర్వహించనున్న ఈ ప్రక్రియ కోసం పాలిటెక్నిక్ కళాశాలలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 19 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. సోమవారం నిర్వహించనున్న ఈ ప్రక్రియ కోసం పాలిటెక్నిక్ కళాశాలలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 19 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది.
పదిన్నరకే ఫలితం!
ప్రతి రౌండ్కు తొమ్మిది వేల ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. చివరి రౌండ్ లెక్కింపులో మరికొన్ని ఓట్లు అదనంగా చేరనున్నాయి. ఉదయం ఎనిమిదింటికి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అధికారికంగా ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. కానీ పదిన్నర, పదకొండు గంటలకే ఫలితం తేలిపోనుంది.
మొదట నంద్యాల, చివర బీవీ నగర్
మొదట నంద్యాల మండలం ఓట్లను లెక్కించి అనంతరం నంద్యాల పట్టణం, గోస్పాడు మండలం ఓట్లను లెక్కిస్తారు. నంద్యాల మండలం పోలూరు గ్రామం ఓట్ల లెక్కింపుతో ప్రారంభమయ్యే లెక్కింపు గోస్పాడు మండలం బీవీ నగర్ గ్రామ ఓట్ల లెక్కింపుతో పూర్తవుతుంది. లెక్కింపు కేంద్రంలోకి పోటీలో ఉన్న అభ్యర్థులు, జనరల్ ఏజెంట్లు, పోలింగ్ సిబ్బంది, అధికారులకు తప్ప ఎవరికీ ప్రవేశం లేదు.
144 సెక్షన్
కౌంటింగ్ కేంద్రం నుంచి వంద మీటర్ల దూరంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పాసులు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతించనున్నారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తారు. లెక్కింపు కేంద్రం వద్ద, సమీప ప్రాంతంలో సుమారు 200 మంది వివిధ స్థాయి పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
అందరి చూపు నంద్యాలపై
ఏపీలో సాధారణ ఎన్నికలు జరిగిన మూడేళ్ల తర్వాత హోరాహోరీగా నంద్యాల ఉప ఎన్నిక జరిగింది. టిడిపి, వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో అన్నది వదిలిపెడితే ఈ ఎన్నిక రెండు పార్టీల నేతల్లోనూ ఓ రకమైన ఆందోళనను కలిగించింది. 2014 ఎన్నికల్లో రాయలసీమలో మెజారిటీ స్థానాలను గెల్చుకున్న వైసిపి పట్టు నిలుపుకోవాలని భావించగా, రాయలసీమలో ముఖ్యంగా నంద్యాలలో టిడిపి జెండా ఎగరాలని ఆ పార్టీ భావించింది.
మంత్రులు మోహరించారు
నంద్యాల ఉప ఎన్నిక కోసం మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, నారాయణ, అఖిలప్రియలు ఎన్నిక వరకు మోహరించారు. 20 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పర్యటించారు. వీరే కాకుండా గుంటూరులోని రాష్ర్ట పార్టీ కార్యాలయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేశ్, ఎమ్మెల్యేలు ధూళిపాళ నరేంద్ర, గద్దె రామ్మోహన్లతో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. నంద్యాలలో కూడా మరో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రతి రోజు నంద్యాలపై సమీక్షించారు. సర్వే బృందాలు ప్రజల పల్స్ పట్టే ప్రయత్నం చేశాయి.
అందరి ఆందోళనా అదే!
నంద్యాల ఉప ఎన్నికల హడావుడి, ఖర్చు చూసిన తర్వాత 2019 ఆశావహులు బెంబేలెత్తిపోతున్నారని అంటున్నారు. డబ్బులు మంచినీళ్లలా ఖర్చు అవ్వడం అందరికీ ఆందోళన కలిగించిందని అంటున్నారు. మూడేళ్ల తర్వాత ప్రజల నాడిని పట్టించే ఎన్నిక కావడంతో టిడిపిప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో మంచి మెజారిటీతో విజయం సాధిస్తే భవిష్యత్తులో జగన్ నోటి దూకుడుకు బ్రేక్ పడుతుందనేది టిడిపి అభిప్రాయం. తాము గెలిచి, బాబు ప్రజావ్యతిరేక పాలన చూపించాలని వైసిపి భావించింది. పోటాపోటీకి పోయి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారని అంటున్నారు. దీంతో ఖర్చు తడిసిమోపెడయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
భవిష్యత్తు ఎన్నికల పట్ల భయం
నంద్యాల ఉప ఎన్నిక ఖర్చు నేపథ్యంలో పలువురిలో భవిష్యత్తు ఎన్నికల పట్ల భయం పట్టుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికలకు ఇంత హడావుడి అవసరమా అనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే 2019 ఎన్నికలకు నంద్యాల ఓ సెమీ ఫైనల్ అని టిడిపి, వైసిపి భావించాయి.
మాదే గెలుపు
ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా చేసిన ఘనత టిడిపిదేనని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నంద్యాలలో టిడిపి భారీ మెజారిటీతో గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు.