ఉడుకుతున్న ఏపీ జిల్లాలు
Temperature in AP: ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది.

ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
మంగళవారం నంద్యాల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లాలోని రుద్రవరంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.1, నెల్లూరు జిల్లా సోమశిలలో 40.9 డిగ్రీల మేర ఎండ తీవ్రత కనిపించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
అన్నమయ్య రాయచోటి జిల్లా పూతనవారిపల్లి, చిత్తూరు జిల్లా పీపల్లి, కడప జిల్లా అట్లూరుల్లో 40.1 డిగ్రీలు చొప్పున, తిరుపతి జిల్లా రేణిగుంటలో 40 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా 108 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇందులో శ్రీకాకుళం జిల్లా- 15, విజయనగరం- 21, పార్వతీపురం మన్యం- 10, అల్లూరి సీతారామరాజు- 8, అనకాపల్లి- 7, కాకినాడ- 7, అంబేద్కర్ కోనసీమ- 3, తూర్పుగోదావరి-13, ఏలూరు- 5, కృష్ణా- 2, ఎన్టీఆర్- 3, పల్నాడు- 8 మండలాల్లో వడగాలుల వీస్తాయని ఏపీఎస్డీఎంఏ వివరించింది.
ఆయా చోట్ల వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం కూడా దీని తీవ్రత కొనసాగుతుందని, 37 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అన్నారు. ఎండ తీవ్రత సమయంలో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications