రాటుదేలుతారా? చతికిలపడుతారా?: అఖిలకు రెండే ఆప్షన్స్.. ఉపఎన్నిక సవాల్!
నంద్యాల ఉపఎన్నిక విషయంలో మంత్రి అఖిలప్రియ ముందు ఇప్పుడు ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి.
నంద్యాల: పొలిటికల్ కెరీర్ ప్రారంభంలోనే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడం సవాల్ తో కూడుకున్న విషయమే. సమర్థవంతంగా వాటిని అధిగమిస్తే గనుక మున్ముందు స్ట్రాంగ్ లీడర్గా ఎదగడానికి ఆ పరిస్థితులు దోహదపడుతాయి. లేదంటే భవిష్యత్తు రాజకీయాలను ఆ ఎఫెక్ట్ వెంటాడుతుంది.
నంద్యాల ఉపఎన్నిక విషయంలో మంత్రి అఖిలప్రియ ముందు ఇప్పుడు ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. అన్న భూమా బ్రహ్మానందరెడ్డిని ఆమె గెలిపించుకోగలిగితే.. పార్టీలో ఆమె ప్రాధాన్యానికి ఢోకా ఉండకపోవచ్చు. ఒకవేళ ఫలితం తారుమారైతే గనుక క్రమంగా ఆమెను కనుమరుగు చేసే ప్రయత్నమూ జరగవచ్చన్న వాదన లేకపోలేదు. అలా జరగకుండా ఉండాలంటే భూమా మరణంపై ఉన్న సానుభూతికి తోడు అఖిలప్రియ రాటుదేలాల్సి ఉంటుంది.

అప్రమత్తంగా ఉండాల్సిన సమయం:
ముఖ్యంగా గంగుల ప్రతాప్ రెడ్డి చేరిక తర్వాత అఖిలప్రియ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని పరిశీలకులు చెబుతున్నారు. నంద్యాలలో భూమా కుటుంబం విఫలమైతే గనుక మున్ముందు ఇక్కడ వారికి స్థానమే లేకుండా పోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకోని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఆ సీటు గంగులకు దక్కిన ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Recommended Video


ఆళ్లగడ్డకే పరిమితం చేస్తే?:
నంద్యాల ఉపఎన్నికలో భూమా ఫ్యామిలీ విఫలమైతే.. నిన్న మొన్నటిదాకా అటు నంద్యాల, ఆళ్లగడ్డ రాజకీయాలను శాసిస్తూ వస్తున్న ఆ కుటుంబాన్ని టీడీపీ ఆళ్లగడ్డకే పరిమితం చేసే అవకాశం లేకపోలేదు. ఆళ్లగడ్డలోను గంగుల ప్రతాప్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ యాక్టివ్ గా ఉంది. ప్రభాకర్ రెడ్డి కుమారుడు గంగుల నాని అక్కడ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎటు చూసిన గంగుల కుటుంబంతో అఖిలప్రియకు ఇబ్బందులు తప్పేలా లేకపోవడంతో.. అఖిలప్రియ తన సత్తా నిరూపించుకోవాల్సిన సందర్భం ఆసన్నమైంది.

ఉపఎన్నిక పైనే భవిష్యత్తు:
శిల్పాచక్రపాణి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లడంతో.. ఆ పదవి గంగుల ప్రతాప్ రెడ్డికి దక్కుతుందన్న ప్రచారం కొనసాగుతోంది. అయితే 2019ఎన్నికల్లో మాత్రం ఆయన నంద్యాల పైనే కన్నేయనున్నారు. అయితే అది ఎంపీగానా? ఎమ్మెల్యే గానా? అన్నది ఇప్పటి ఉపఎన్నికపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. నంద్యాల రాజకీయంలో గంగుల ఎంటరైతే.. అఖిలకు చెక్ పెట్టుకుంటూ వెళ్తారన్న వాదన ఉండటంతో.. తలపండిన నేతలను ఆమె ఎలా ఎదుర్కొంటారోనన్న దానిపై ఆసక్తి మొదలైంది.

రాజకీయ సన్యాసం:
ఉపఎన్నికలో భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకోకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని అఖిలప్రియ సవాల్ చేసి ఉన్నారు. ఈ సవాల్ లో ఆమె నెగ్గితే గనుక అటు పార్టీలోను, ఇటు జనంలోను ఆమెకంటూ సొంత ఇమేజ్ ఏర్పడుతుంది. టీడీపీలో తన ప్రాధాన్యతను కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫలితం తారుమారైతే మాత్రం టీడీపీ అధిష్టానం చెప్పింది వినడమే తప్ప అఖిలప్రియకు ఆప్షన్ అంటూ ఏమి ఉండదు.
కాబట్టి నంద్యాల ఉపఎన్నికలను సమర్థవంతంగా ఉపయోగించుకుని అఖిలప్రియ రాజకీయాల్లో రాటుదేలుతారా?. లేదా అనుభవలేమితో చతికిలపడి భవిష్యత్తుపై నీడలు కమ్ముకునేలా చేసుకుంటారా? అన్నది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications