ఆ ప్రశ్నలకు నలిగిపోతున్న బ్రహ్మానందరెడ్డి: నంద్యాల ప్రచారంలో ఉక్కిరిబిక్కిరి!..
భూమా నాగిరెడ్డి మాదిరి దూకుడైన వ్యక్తిత్వం కాకపోవడంతో.. సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రజలను సమాధానం పరచడంలో ఆయన కాస్త తత్తరపడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నంద్యాల: కొత్తగా రాజకీయం నేర్చేవాళ్లు.. మునుపటి బిడియాన్ని పక్కనపెడితే తప్ప రాటుదేలడం కష్టం. ప్రత్యర్థుల విమర్శలను పటాపంచలు చేసే మాట తీరు.. ప్రజల్లోకి చొచ్చుకెళ్లగలిగే నేర్పు ఉంటేనే ఏ రాజకీయమైనా అధికారానికి చేరువవుతుంది. అలా అని మాటలకే పరిమితమైతే.. అదే జనం కర్రు కాల్చి వాత కూడా పెట్టగలరు.
నంద్యాల ఉపఎన్నికతో రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. బొత్తిగా అనుభవ లేమితో బరిలో దిగడంతో.. కొత్త రాజకీయ పాఠాలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భూమా నాగిరెడ్డి మాదిరి దూకుడైన వ్యక్తిత్వం కాకపోవడంతో.. సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రజలను సమాధానం పరచడంలో ఆయన కాస్త తత్తరపడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే భూమా సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డే బ్రహ్మానందరెడ్డి గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్నారు. బ్రహ్మానందరెడ్డి బదులు అన్ని విధాలా ప్రజలకు ఆయనే నచ్చజెప్పుతున్నారు. ఆశీర్వాద యాత్ర పేరుతో నంద్యాలలో ప్రచారం ప్రారంభించిన బ్రహ్మానందరెడ్డికి.. ప్రజలంతా సమస్యలను ఏకరువు పెట్టడంతో నోట మాట రావడం లేదట. దీంతో ఆయన తరుపున ఏవీ సుబ్బారెడ్డే సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామిలు కూడా ఇచ్చేస్తున్నారట.
బ్రహ్మానందరెడ్డి అంత బలమైన అభ్యర్థి కాకపోవడంతో.. ఆయనకు బదులు ఎక్కువగా టీడీపీ పేరునే ఏవీ సుబ్బారెడ్డి సహా మిగతా నేతలు వాడుతున్నారట. అంటే, బ్రహ్మానందరెడ్డికి ఓటేయమని కాకుండా, టీడీపీకి.. సైకిల్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నారట. మొత్తం మీద నంద్యాల ఉపఎన్నిక టీడీపీకి పెద్ద సవాల్ గా మారిందని ఈ పరిణామాలను గమనిస్తే అర్థమవుతోంది. చూడాలి మరి భూమా బ్రహ్మానందరెడ్డి పొలిటికల్ ఎంట్రీకి అక్కడి జనం ఎలా స్పందిస్తారో!












Click it and Unblock the Notifications